పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బాధపడుడేంది? కొనాలని వాళ్లను, వీళ్లను బతిమిలాడుడేంది? పసుపు, మక్క, నువ్వులకు మార్కెట్లో మస్తు డిమాండ్ ఉన్నది. లాభాలు కూడా మస్తుగొస్తయ్. అందుకే పొలాన్ని చిదగొట్టి మక్క పంట వేసిన.. అని
అంటున్నాడు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన మండ శ్రీనివాస్. వచ్చే వానకాలంలో పసుపు వేస్తానని, ఇతర పంటలే బెటర్ అని చెప్తున్నాడీ యువరైతు.
జగిత్యాల, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): లాభం లేని పొలం కంటే, లాభదాయకమైన పసుపు, మక్క పంటలు వేయటమే ఉత్తమం అని యువరైతు మండ శ్రీనివాస్ అంటున్నాడు. పొలం వేసిన భూమిలో ఇతర పంటలు సాగు చేయరాదన్నది ఉత్త మాటేనని, ఒక పంటను మార్చి మరో పంటను వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. వడ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది పడే కంటే, పసుపు పంటేసి లాభాలు పొందవచ్చని వివరించాడు. ఈ యాసంగిలో పొలంలో మక్క వేశానని చెప్పాడు. ‘వరిని సాగుచేస్తే ఆశించిన మేర లాభాలు రావు. ఏ సీజన్లో అయినా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తది. ఎకరాన క్వింటాల్కు రూ.2వేలు వేసుకొన్నా, రూ.60 వేలు వస్తాయి. రెండు సీజన్లలో కలిపితే రూ.1.20 లక్షలు వస్తాయి. అందులో సాగు కోసమే రూ.58వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తది. నారు, కూలీలు, ట్రాక్టర్ దున్నటానికి, జింక్ మందు బస్తాలు, గడ్డి కోసుడు, కలుపు, మందు, మందు కొట్టే కూలీలు, కోతకు హార్వెస్టర్, ధాన్యం రవాణా, తట్లు, కాంటా.. ఇలా ఖర్చు బాగైతది. ఏడాదంతా కలిపి పెట్టబడి పోను మిగిలేది రూ.62 వేలే’ అని శ్రీనివాస్ లెక్కలతో సహా వివరించాడు.
వరితో పోల్చితే పసుపు పంటతో మండి లాభాలు వస్తాయి. ఎకరంలో పసుపు వేస్తే 35 నుంచి 40 డ్రమ్ముల దిగుబడి వస్తుంది. పసుపు సాగు ఖర్చు చూస్తే.. దున్నకానికి రూ. 5 వేలు, 4 ట్రాక్టర్ల పెండకు రూ. 20 వేలు, విత్తనం పసు పు 6 కడాయిలు రూ.12 వేలు, కూలీలు, నాగళ్లకు రూ.5 వేలు, లారీ కోడి ఎరువుకు రూ.12 వేలు, పసుపు తవ్వేందుకు రూ.20 వేలు, ఉడకబెట్టేందుకు రూ.6 వేలు, కట్టెలకు రూ.5 వేలు అవుతాయి. వీటికి అదనంగా మరో రూ.5 వేలు కలుపుకొంటే ఎకరానికి పెట్టుబడి రూ.90 వేల దాకా అవుతుంది. ఆదాయపరంగా చూస్తే పసుపు పంట ఎకరానికి 40 డ్రమ్ముల వరకు వస్తుంది. ఒక్కో డ్ర మ్ముకు రూ.5 వేల చొప్పున లెక్కవేస్తే రూ.2 లక్షల ఆదా యం వస్తుంది. మక్కను అంతర పంట గా వేస్తారు. సాలీనా రూ.30 వేల ఆదా యం వస్తుంది. మక్క తర్వాత నువ్వు పంటను సాగు చేస్తారు. ఈ పంటకు కూడా అంతగా పెట్టుబడి అవసరం లేదు. విత్తన నువ్వు కోసం రూ.500 ఖర్చవుతుంది. నువ్వు పంట ద్వారా రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. పసుపు, అంతర పంటలుగా మక్క, నువ్వు సాగు చేయటం ద్వారా రైతు రూ.2.70 లక్షలు ఆదాయం వస్తుంది. పెట్టుబడికి లక్ష పోయినా రూ.1.70 లక్షల ఆదాయం వస్తుంది. వరితో పోల్చితె పసుపు సాగుతో రైతు మూడు రెట్ల ఎక్కువ ఆదాయం పొందవ చ్చు. యువరైతు శ్రీనివాస్ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
నాకు 15 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఆరెకరాల్లో ఎప్పటి నుంచో పసుపు సాగు చేస్తున్న. మిగిలిన భూమిలో మొన్నటిదాకా పొలం వేసిన. ఏనాడూ లాభాలు రాలే. వడ్లు అమ్ముడు తిప్పలైతాంది. సీఎం కేసీఆర్ సార్ కూడా వేరే పంటలు ఏసుకోండ్రి అని చెప్పుడుతోటి పొలాన్ని చిదగొట్టాలని అనుకొన్న. అందరు పొలం ఎట్ల చిదగొడుతవురా, వేరేటియి పండుతయా? అన్నరు. పొలం కోసినంక ఉన్న కొయ్యకాలు మళ్లలోనే మక్క ఏసిన, మొలిచింది. ఈ యాసంగిలో మక్కనే పండిస్త. వచ్చే వానకాలంల పసుపు ఏత్త. ఏ కాలం చూసినా ఆ పంటకు డిమాండ్ ఉంటది. లాభాలు గూడ మస్తుగొస్తయ్.
మండ శ్రీనివాస్
ఫోన్ నంబర్:9490030949