నిన్న మొన్నటిదాకా.. ‘వ్యవసాయం’ అంటే వరి లేదా పత్తి అన్నట్లే ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారుతున్నది. సంప్రదాయ సాగుతోపాటు.. లాభదాయకమైన పంటలపై కర్షకుల ‘పట్టు’ పెరుగుతున్నది. ఈ క్రమంలో ‘సెరికల్చర్’.. సిరులకు కేరాఫ్గా నిలుస్తున్నది. నెలనెలా ఆదాయాన్ని అందిస్తూ.. రైతును రాజుగా మారుస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి పెడుతున్నారు. సంప్రదాయానికి భిన్నంగా.. వ్యవసాయంలోనూ నెల నెలా ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతో సిద్దిపేట జిల్లా రైతులు ‘పట్టుసాగు’లో రాణిస్తున్నారు. 17 మండలాల్లో వెయ్యి ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. మరోవైపు పట్టు పరిశ్రమ కూడా సబ్సిడీలతో రైతులను ప్రోత్సహిస్తున్నది. ఓసీ, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం వరకూ సబ్సిడీలు, రుణాలు అందిస్తున్నది. వీటిని సద్వినియోగం చేసుకుంటున్న రైతులు.. పట్టుసాగుతో అధిక లాభాలు పొందుతున్నారు. రాష్ట్రంలోనే పట్టు సాగులో సిద్దిపేట జిల్లా ముందంజలో ఉన్నదని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఏడాదికి పది పంటలు :
పట్టు పురుగుల పంటకాలం నెల రోజుల్లోనే పూర్తవుతుంది. ఈ లెక్కన ఏడాదికి తొమ్మిది నుంచి పది పంటలు తీసే అవకాశం ఉన్నది. సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు బెంగళూరు నుంచి పట్టుగుడ్లను తెప్పిస్తున్నారు. ఇందుకోసం వంద గుడ్లకు రూ. 800తో కొనుగోలు చేస్తున్నారు. ఈ పట్టుగుడ్లను నల్లని బట్ట లేదా పేపర్ చట్రాలలో పొదిగేస్తారు. ఒక్కో గుడ్డు నుంచి 500లకు పైగా పిల్లలు బయటికి వస్తాయి. ఈ పురుగులను పెంచడానికి ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది.
మేతగా మల్బరీ ఆకు :
మొత్తం ఐదు దశల్లో పట్టు పురుగుల పెంపకం కొనసాగుతుంది. వీటికి మల్బరీ ఆకులను మేతగా వేస్తారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి పట్టు పురుగు నిద్రలోకి వెళ్తుంది. ఈ సమయంలో పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. పురుగు పెరిగే కొద్దీ మేతను ఎక్కువగా తీసుకుంటుంది. చివరి దశలో రోజుకు రెండుసార్లు మేత వేయాల్సి ఉంటుంది. నాలుగో దశ తర్వాత కండెకు వస్తుంది. మొత్తంగా పట్టు పురుగుల పంటకాలం 21 రోజుల నుంచి 25 రోజుల్లో పూర్తవుతుంది. కండెకు వచ్చిన పురుగును వేరుచేసి, మార్కెట్కు తరలిస్తారు. ప్రస్తుతం కిలోకు రూ. 700 నుంచి రూ.750 వరకు ధర పలుకుతున్నది. ఒక రైతు 250 గుడ్లతో పట్టు పురుగుల పెంపకం చేపడితే.. రూ.లక్షకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. పెట్టుబడి ఖర్చులు రూ. 10 వేలు తీసేసినా.. రూ. 90 వేల దాకా మిగులుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం :
పట్టు పురుగులు పెంచుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. షెడ్ నిర్మాణానికి, మొక్కలు నాటడానికి, ఇతర పరికరాలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓసీ, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం సబ్సిడీని అందిస్తున్నది. యూనిట్ ధర రూ.4 లక్షలు ఉండగా, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుంది. రెండు ఎకరాలలో మొక్కలు నాటడానికి రూ. 25,000, రేరింగ్ షెడ్ నిర్మాణానికి రూ. 2,00,00 ప్రభుత్వం నుంచి సబ్సిడీగా వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు మొక్కలు నాటడానికి రూ.32,500, రేరింగ్ షెడ్ నిర్మాణానికి 2,60,00 అందిస్తున్నది. ఉపాధిహామీ పథకంలో మొక్కలు నాటడానికి ఒక్కో రైతుకు కూలీలకుగాను రూ.36,508, రేరింగ్ షెడ్ నిర్మాణానికి రూ.4,580 ఇస్తున్నది. మెటీరియల్ పేమెంట్ కింద మొక్కలు నాటడానికి రూ. 3,270, రేరింగ్ షెడ్ నిర్మాణానికి రూ.88,845 అందిస్తున్నది. అంటే ఒక్క రైతుకు మొత్తంగా పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఓసీ, బీసీలకు రూ.2,25,000, ఉపాధిహామీ నుంచి రూ.1,32,843.. మొత్తంగా రూ.3,57,843 అందుతున్నది. ఎస్సీ, ఎస్టీలకు పట్టుపరిశ్రమ శాఖ నుంచి రూ. 2,92,500, ఉపాధిహామీ నుంచి రూ. 1,32,843.. మొత్తంగా రూ. 4,25,343 సబ్సిడీల రూపంలో అందుతున్నది.
పట్టు పురుగుల పెంపకంతో మంచి ఆదాయం ఉన్నది. నెలకు లక్ష దాకా సంపాదించవచ్చు. నేను చాలా సంవత్సరాలుగా పట్టు సాగు చేస్తున్నా. ఇందులో చాలా అనుభవం సంపాదించా. మంత్రి హరీశ్రావు, అధికారుల ప్రోత్సాహం బాగున్నది. ఇతర పంటల దిగుబడి కోసం నెలల తరబడి వేచి చూడాలి. పట్టు సాగులో కేవలం నెలలోపే చేతికొస్తుంది. ఏడాదికి పది పంటలు తీయొచ్చు. నెల నెలా లక్షల్లో సంపాదించొచ్చు. ఈ పంటలకు కోతులు, అడవిపందులు, చీడపీడల బెడద ఉండదు. పెట్టుబడి చాలా తక్కువ.
పెద్దోల్ల నర్సింలు, చంద్లాపూర్.
మొన్నటిదాకా వరి, మక్కజొన్న, కూరగాయలు వేసేవాళ్లం. పెట్టుబడి ఖర్చు ఎక్కువ అయ్యేది. కూలీల కొరతతో ఒక్కోసారి పంట కూడా చేతికి వచ్చేది కాదు. అందుకే, ఇప్పుడు పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టిన. లాభం మంచిగనే ఉంది. ఇంట్లో వాళ్లతోనే పని అయిపోతున్నది. నెల తిరిగే సరికే పంట చేతికి వస్తున్నది. పట్టు సాగులో ఎలాంటి ఇబ్బందులూ లేవు.
భార్యాభర్తలు ఇద్దరే అన్ని పనులూ చూసుకోవచ్చు. నెలనెలా ఆదాయం పొందవచ్చు.
అనుపాటి తిరుపతిరెడ్డి, (చంద్లాపూర్, నూతన పట్టు రైతు) కత్తుల శ్రీనివాస్రెడ్డి