ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడో యువరైతు. ఒకే పంటకు పరిమితం కాకుండా పంటమార్పిడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమితోపాటు మరికొంత కౌలుకు తీసుకొని లాభాల పంట పండిస్తున్నాడు. అతనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన యువరైతు బోయిన తిరుమలేశ్. ఏ సీజన్లో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో అదే పండించాలనేది తిరుమలేశ్ సిద్ధాంతం. అందుకే, గత పదకొండేండ్లుగా ఏ ఒక్కసారికూడా ఒకే రకమైన పంటను పండించలేదు. తనకున్న నాలుగున్నర ఎకరాలకు తోడు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని ఆదర్శ వ్యవసాయం చేస్తున్నాడు. ఇంటి అవసరాలమేర వరి పండించుకుంటూ మిగిలిన దాంట్లో మక్కజొన్న, బొప్పాయి, పత్తి, బంతి, తైవాన్ జామ, కశ్మీరీ యాపిల్ బేర్ తదితర పంటలతోపాటు పలురకాల కూరగాయలూ సాగు చేస్తున్నాడు.
మూస ధోరణికి గుడ్బై
సరికొత్త మెలకువలు నేర్చుకుంటూ లాభాలు ఆర్జించే పంటల గురించి తెలుసుకోవాలని, మూస ధోరణిని విడిచిపెట్టి అందరికీ భిన్నంగా ఆలోచిస్తేనే వ్యవసాయంలో మంచి లాభాలను పొందుతామని చెబుతున్నాడు తిరుమలేశ్. తమ ప్రాంతానికి మూడేండ్లుగా గోదావరి జలాలు వస్తుండటంతో ఇతర రైతులు వరివైపు మళ్లినా, తిరుమల మాత్రం అటుగా అడుగు వేయలేదు. ఎందుకంటే, ఒకే రకమైన పంటలు ఒక్కసారే చేతికి వస్తే డిమాండ్ తగ్గిపోయి, ధరలుకూడా అదే స్థాయిలో పడిపోతాయని అతడి అభిప్రాయం. అది నిజం కూడా. అందుకే, ఇతర రైతులకు భిన్నంగా తన వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నానని చెబుతున్నాడు.
14.5 ఎకరాల్లో 15 లక్షల పంట
తిరుమలేశ్ ఏడాదిలో 9 నెలలు ఏదో ఒక పంటను సాగు చేస్తూ ఎకరానికి రూ. లక్షకు పైగానే సంపాదిస్తున్నాడు. అంటే, ఏడాదిలో రూ.15 లక్షలదాకా ఆర్జిస్తున్నాడు. ఏడాదిలో 10 నెలలు తన పొలంలో ఏదో ఒక రకమైన కూరగాయలు పండుతూనే ఉంటాయని చెబుతున్నాడు. ఇలా పంటలు ఏరడానికి, కలుపు తీయడానికి, ఇతరత్రా పనులకు రోజుకు 8 నుంచి 10 మంది కూలీలకూ పని కల్పిస్తున్నాడు.
… గుండా శ్రీనివాస్ గుప్తా
వ్యవసాయంలో చేసుకున్నోడికి చేసుకున్నంత లాభం. నేను పదకొండేండ్లుగా సేద్యం చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు, 24 గంటల విద్యుత్తు, నీళ్లు.. ఇలా ప్రతి ఒక్కటీ రైతులకు అందుతుండటంతో మరింత లాభదాయక పంటలు పండించే అవకాశం వచ్చింది. ప్రతి సీజన్లో 5 నుంచి 10 రకాల పంటలు వేస్తున్నా. ప్రధానంగా కూరగాయలతో లాభం ఎక్కువ. ఏడాదిలో 10 నెలలు నావద్ద ఏదో ఒక రకమైన కూరగాయలు పండుతూనే ఉంటాయి. సీజన్కు తగ్గట్లుగా పంటలు వేసి, మన వంతుగా కష్టపడితే లాభాలు అవే వస్తాయి. సీఎం కేసీఆర్ చెప్పేదికూడా ఇదే. నేడు ప్రభుత్వం అన్నీ సమకూరుస్తున్నందున పంటమార్పిడితో సాగు చేస్తే మంచి లాభసాటిగా ఉంటుంది. –బోయిన తిరుమలేశ్, రైతు