Mulching | కోటగిరి, మార్చి 3: ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో వివిధ సమస్యలను అదిగమించడంతోపాటు మంచి దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబించాలి. మెరక భూముల్లో పంటలను సాగుచేస్తే కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. సాగునీరు పెట్టిన ప్రతిసారీ కలుపు మొక్కలు పెరుగుతుండడంతో వాటిని తొలగించడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి కూలీలు అందుబాటులో ఉండరు. ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. కలుపు నివారణతోపాటు భూమిలో తేమ శాతం ఎక్కువరోజులు ఉండేలా మల్చింగ్ విధానం ఎంతో దోహదపడుతుంది. దీంతో రైతుకు ఆర్థికభారం తగ్గడంతోపాటు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండల పరిధిలోని పొతంగల్ గ్రామానికి చెందిన పూదం పరశురాం.. కర్బూజ పంటను మల్చింగ్ విధానంలో సాగుచేసి మంచి లాభాలు గడిస్తున్నారు.
మొక్కల చుట్టూ వేర్ల దగ్గర మట్టిని ఏదైనా పదార్థంతో కప్పి పెట్టాడాన్ని మల్చింగ్ అంటారు. ఎండు గడ్డి, ఎండిన ఆకులు, ఊక, వరి, రంపపుపొట్టును ఉపయోగించి సహజసిద్ధమైన విధానంతో కూడా మల్చింగ్ చేస్తారు. కృత్రిమంగా తయారు చేసే ప్లాస్టిక్ షీట్తోనూ మల్చింగ్ చేయొచ్చు. ఈ పద్ధతులతో భూమిలోని తేమను సంరక్షించడంతోపాటు కలుపు నివారణ, నేల కోతకు గురికాకుండా కాపాడుకోవచ్చు. మల్చింగ్ విధానంలో రసాయన ఎరువులు, సస్యరక్షణకు అయ్యే ఖర్చును 25 శాతానికి పైగా ఆదా చేసుకోవచ్చు.
మొక్కకు ఇరువైపులా 5-10 సెంటీమీటర్ల లోతులో నాగలిసాలు వేయాలి. కావాల్సిన సైజులో మల్చింగ్ షీట్ను కత్తిరించుకోవాలి. దీనిని ప్రతి వరుస మీద బిగుతుగా, ఇరువైపులా నాగలి సాలులోకి పోయేలా ఏర్పాటుచేసుకొని మట్టితో అంచులను కప్పి వేయాలి. షీట్ను మరీ బలంగా లాగొద్దు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే షీట వేసుకోవాలి. విత్తకముందే మల్చింగ్ షీట్ వేయాలనుకుంటే మొక్కల మధ్య దూరాన్ని బట్టి ముందుగానే రంధ్రాలు చేసుకోవాలి.
కోటగరి ఉమ్మడి మండలం పొతంగల్ మంజీరా నది శివారులో సూదం పరశురాం అనే రైతు మల్చింగ్ విధానంలో కర్బూజ పంటను సాగుచేస్తున్నారు. ముందుగా దుక్కులు చేసి, నాగలి సాళ్లు ఏర్పాటు చేసుకున్నాక మల్చింగ్ షీట్ను వేశారు. షీట్పై మూడు అంగుళాల పీవీసీ పైపుతో డైమండ్ ఆకారంలో రంధ్రాలు చేశారు. దీంతో భూమిలో తడి ఎక్కువకాలం ఉంటుందని, సాగునీటి వినియోగం కూడా తగ్గుతుందని పరశురాం తెలిపారు.
నాలుగు ఎకరాల భూమిలో మల్చింగ్ విధానంలో పంటలు సాగు చేస్తున్నా. మార్కెట్లో కర్బూజకు మంచి డిమాండ్ ఉండడంతో ఎకరంన్నర పంట వేశాను. మరో ఎకరంన్నరలో పచ్చిమిర్చి, ఎకరంలో టమాట పంట కూడా ఇదేవిధానంలో సాగు చేస్తున్నా. 80 రోజుల అనంతరం ప్రస్తుతం కర్బూజ కోతకు వచ్చింది. అదే మల్చింగ్ షీట్ను ఉపయోగించి రెండోసారి కూడా విత్తనాలు నాటుకోవచ్చు. కాయగూరలు సాగుచేసినా మంచి దిగుబడి వస్తుంది. కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. మల్చింగ్ షీట్ వేసుకుంటే దాదాపు 75 శాతం అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేయొచ్చు.
– సూదం పరశురాం, రైతు, పొతంగల్