వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరుగుతున్నది. సాగు విధానాలు, పంటలు, తెగుళ్లపై అవగాహన పెంచుకోకుండా రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లుతున్నారు. దీంతో సాగు వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నది. అంతేకాక నేల నిర్జీవంగా మారుతున్నది. గాలి, నీరు సైతం కలుషితం అవుతున్నాయి. పంట ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు కనిపిస్తున్నాయి. వీటిని తిన్న అనేక మంది క్యాన్సర్ లాంటి భయానక రోగాల బారిన పడుతున్నారు.
అనేక అనర్థాలు కలిగిస్తున్న ‘రసాయన’ వ్యవసాయం నుంచి రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. పూర్తిస్థాయి సేంద్రియ, ప్రకృతి సాగు మార్గాలను అన్వేషిస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ, అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. వాటిని ‘సేంద్రియ ఉత్పత్తుల’ పేరిట అమ్ముతూ, మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే, సేంద్రియ సాగులో వాడాల్సిన జీవ ఎరువులు, జీవ నియంత్రకాలపై ఇప్పటికీ చాలామందికి సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో జీవ ఎరువులు, జీవ నియంత్రకాల గురించి సమగ్రంగా వివరిస్తున్నారు.. జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ అసిస్టెంట్ సైంటిఫిక్ (సూక్ష్మజీవ శాస్త్రం) ఆఫీసర్ దామోదరాచారి.
జీవ ఎరువుల ప్రాముఖ్యం..
జీవ ఎరువులు అనేక రకాలు. వాటిలో ప్రధానమైనవి నత్రజని, భాస్వరం, పొటాషియం అందించడంతోపాటు చెత్తను కుళ్లిపోయేలా చేస్తాయి. ఈ జీవ ఎరువులు పొడి, ద్రవ రూపాల్లో లభిస్తాయి. వీటిని నేలపై చల్లుకోవచ్చు. విత్తనశుద్ధికీ వాడుకోవచ్చు. జీవ ఎరువులు ఉపయోగించి, నేలకు బలం చేకూర్చవచ్చు. ఫలితంగా అధిక దిగుబడులు సాధించవచ్చు.
లాభాలు అనేకం..
జీవ ఎరువులు భూసారం, భూ భౌతిక, రసాయన లక్షణాలను మెరుగుపరుస్తాయి.
నేల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు పోషకాలను పెంచుతాయి.
పంట దిగుబడిని సగటున 20 నుంచి 40 శాతం పెంచుతాయి.
పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు.
పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తాయి.
గాలి, నీరు, మట్టి కలుషితం కావు.
పంట ఉత్పత్తులపై దుష్ఫలితాలను చూపవు.
నేలలను బట్టి..
జీవ ఎరువులను వాడేటప్పుడు సరైన మిశ్రమాన్ని ఎంచుకోవాలి.
నత్రజని, భాస్వరం ఎరువుల లభ్యత కోసం నైట్రోజన్, ఫాస్ఫరస్ను సమానంగా వినియోగించాలి.
పప్పుధాన్యాలు, ఇతర పంటల కోసం రైజోబియం, పీఎస్బీని సమాన పరిమాణంలో విత్తనశుద్ధిగా మాత్రమే వాడాలి.
తక్కువ తేమ నిలుపుకొనే ఇసుక, తేలికపాటి నేలల్లో వేసిన పప్పుదినుసులు కానీ, ఇతర వాణిజ్య పంటలకు సమాన పరిమాణంలో అజటోబాక్టర్+పీఎస్బీని ఉపయోగించాలి.
బంక, ఇతర నేలల్లో మాత్రం అజోస్పైరిల్లమ్+పీఎస్బీని సమపాళ్లలో వాడాలి.
మధ్యస్థ, ఆమ్ల నేలల్లో అజటోబాక్టర్+అజోస్పైరిల్లమ్+పీఎస్బీని 1:1:2 నిష్పత్తిలో వినియోగించాలి.
విత్తనశుద్ధి ఇలా..
ముందుగా ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని తీసుకొని నీడలో ఓ చోట కుప్పగా పోయాలి.
200 మిల్లీ లీటర్ల ద్రవరూప జీవ ఎరువును వాటికి పట్టించాలి.
ఓ అరగంట సేపు ఆరబెట్టాలి.
24 గంటల తర్వాత విత్తనాలను విత్తుకోవచ్చు.
ఆమ్ల, ఆల్కలైన్ నేలలు ఉంటే విత్తన శుద్ధి చేసేటప్పుడు సున్నం, జిప్సం వాడటం ఉత్తమం.
నారు శుద్ధి..
వరి, పొగాకు, కూరగాయలు, మిరప, టమాట, ఇతర పంటల్లో ఈ విధానాన్ని ఉపయోగించాలి.
4-5 మిల్లీ లీటర్ల ద్రవరూప జీవ ఎరువును లీటర్ నీటిలో కలుపుకోవాలి.
ఈ ద్రావణంలో నారును 20 ని॥ పాటు ఉంచాలి.
తదుపరి ప్రధాన పొలంలో నాటుకోవచ్చు.
నేలలో చల్లే విధానం..
బాగా చివికిన 100 కిలోల పశువుల పేడలో 200 మిల్లీలీటర్ల ద్రవరూప జీవ ఎరువును కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఓ కుప్పగా పోసి 10 రోజుల పాటు మాగనివ్వాలి.
ఈ కుప్పపై ప్రతిరోజూ కొన్ని నీళ్లు పోస్తూ ఉండాలి.
దున్నే ముందు పొలంలో ఈ ఎరువును వెదజల్లాలి.
బిందుసేద్యం..
ద్రవరూప జీవ ఎరువులను బిందుసేద్యంలోనూ వాడుకోవచ్చు.
200 మిల్లీలీటర్ల జీవ ఎరువులను 100 లీటర్ల ఫర్టిగేషన్ ట్యాంక్లో కలుపుకొని అందించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
జీవ ఎరువులను గది ఉష్ణోగ్రత వద్దే భద్రపరచాలి. సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.
జీవ ఎరువుల మోతాదు మించకుండా వాడాలి.
గడువు చెల్లిన జీవ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు.
రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి జీవ ఎరువులను చల్లరాదు.
ముఖ్యమైన ఎరువులు.. వాటి ఉపయోగాలు
1) రైజోబియం..
ఇది పప్పుజాతి పంటల్లో వేర్లను అంటిపెట్టుకొని ఉంటుంది.
జీవ ఎరువులు హెక్టారుకు 50-100 కిలోల నత్రజనిని స్థిరీకరిస్తాయి.
2) అజటోబాక్టర్/ అజోస్పెరిల్లమ్
ఈ సూక్ష్మజీవులు మొక్కల వేర్ల వద్ద నివసిస్తూ
కావాల్సిన నత్రజనిని అందిస్తాయి.
హెక్టారుకు 10-30 కిలోల నత్రజనిని అందించగలవు.
మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే హార్మోన్లనూ స్రవించగలవు.
3) అజొల్లా
ఇది నీటిపై తేలాడే ఫెర్న్ జాతి మొక్క.
హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజనిని అందించగలదు.
అజొల్లాను పశువులు, కోళ్లకు దాణాగా వాడుకోవచ్చు.
ముఖ్యంగా వరిలో అజొల్లాను వాడితే నత్రజనిని ఇవ్వడంతోపాటు కలుపును నివారించుకోవచ్చు.
4) భాస్వరం కరిగించే ఎరువులు (బాసిల్లస్, సుడోమోనాస్ బాక్టీరియా)
ఈ సూక్ష్మజీవులు నేలలో కరగకుండా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయి.
హెక్టారుకు 25-30 కేజీల p20s లభ్యమయ్యేలా చేయగలవు.
5) పోటాషియం కరిగించేవి..
ఈ సూక్ష్మజీవులు నేలలోని సిలికేట్ మినరల్స్ నుంచి పొటాష్ను వేరు చేస్తాయి.
కరిగించిన పొటాష్ను మొక్కలు తేలిగ్గా గ్రహించేలా చూస్తాయి.
6) మైకోరైజా(వ్యామ్)
శిలీంధ్రజాతికి చెందిన ఈ సూక్ష్మజీవులు మొక్కల వేర్లను అంటిపెట్టుకొని ఉంటాయి.
మొక్కలకు అవసరమైన భాస్వరాన్ని, ఇతర పోషకాలను సరఫరా చేస్తాయి.
నేలలో సేంద్రియ కర్బనశాతం పెరిగేందుకు దోహదపడతాయి.
మొక్కలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా చేస్తాయి.
వేర్ల చుట్టూ ఇతర సూక్ష్మజీవుల సంఖ్య పెరిగేలా చూస్తాయి.
7). చెత్తను కుళ్లింప జేసేవి..
జీవ ఎరువుల్లో ఉండే సూక్ష్మజీవులు శిలీంధ్ర, బాక్టీరియా జాతికి చెందినవి
ఇవి చెత్తను కుళ్లింపజేసి సేంద్రియ పదార్థాన్ని పెంచి నేల సాంద్రతను మెరుగపరుస్తాయి.
పంట అవశేషాలను కాల్చకుండా ఈ ఎరువులను వాడి కుళ్లింపజేసుకోవచ్చు.
జీవ ఎరువులు దొరికే ప్రదేశాలు..
నాణ్యమైన జీవ ఎరువులు వాడితేనే రైతులకు అధిక ప్రయోజనం ఉంటుంది. ఈ ఎరువుల కోసం రాజేంద్రనగర్లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (NIPHM), జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాల (ARI), వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రి బయోటెక్ ఫౌండేషన్ను సంప్రదించవచ్చు.
-దామోదరాచారి
అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎన్ఐపీహెచ్ఎం) ఫోన్: 9542638020
-అండెం శ్రీనివాస్రెడ్డి