దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ పల్లె. స్థానిక రైతులు ‘ఉల్లిగడ్డ’ను భారీ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఊరు పేరు కాస్తా.. ‘ఉల్లిగడ్డ దామెర’ అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఉల్లి సాగు చేయాలన్నా, దామెరకు వచ్చి పోవాల్సిందే. ఇక్కడి రైతుల సాగు విధానాల గురించి తెలుసుకోవాల్సిందే.
దశాబ్దం క్రితం వరకు దామెర రైతులు కూడా సంప్రదాయ పంటలే సాగు చేసేవారు. వరి, మక్కజొన్న, పత్తి తప్ప ఏమీ వేసేవారు కాదు. అయితే, పెట్టుబడి ఖర్చు పెరగడం, మార్కెట్లో లాభసాటి ధర రాకపోవడంతో కొత్త దారిని వెతుక్కున్నారు. సంప్రదాయ పంటలను వదిలి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 500 ఎకరాల్లో ఉల్లిగడ్డ, 250 ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనేది లేదని చెబుతుండటంతో ‘పామాయిల్’ సాగు చేసేందుకు నిర్ణయించారు. ఈమేరకు గ్రామానికి చెందిన 20 మంది రైతులు ఉద్యానశాఖకు అంగీకారం తెలిపారు. దామెర రైతులను ఆదర్శంగా తీసుకొని, చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా పామాయిల్ సాగుకు మొగ్గు చూపుతున్నారు.
పామాయిల్ సాగుకు ముందుకొచ్చిన దామెర రైతులకు ఉద్యానశాఖ అధికారులు అవగాహన తరగతులు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, అశ్వారావుపేట ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ పామాయిల్ సాగు చేస్తున్న రైతుల అనుభవాలు, సాగు విధానం, పెట్టుబడి, లాభాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
పత్తి, వరి పంట వేస్తే ఏం మిగలడం లేదు. పత్తి ఏరడానికి కూలీలు దొరకడం లేదు. ఇక వానలు ఎక్కువై వరి మొత్తం దెబ్బతింటున్నది. పెట్టుబడులు ఎక్కువై, లాభాలు తక్కువయ్యాయి. పామాయిల్ పంట గురించి విన్నం. ఖమ్మం జిల్లాలోని రైతుల దగ్గరకు వెళ్లి, పామాయిల్ పంటలను చూసి వచ్చాం. సబ్సిడీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే, నాలుగెకరాల్లో పామాయిల్ పండించేందుకు నిర్ణయించా. వచ్చే వానకాలం సీజన్లో పామాయిల్ మొక్కలు ఇస్తామని అధికారులు చెప్పారు.
–కొమ్మిడి అన్నారెడ్డి, రైతు
–పిన్నింటి గోపాల్