వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది అన్నదాతలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నది. సాగులో కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. రైతులకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తూ.. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం సేంద్రియ సాగులో పాలీహౌస్ ద్వారా కూరగాయలు సాగు చేయాలనుకునే రైతులకు సబ్సిడీ అందిస్తున్నది. దీంతో చాలా మంది రైతులు పాలీహౌస్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు.
-రుద్రూర్, మే 5
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ.. సేంద్రియ ఎరువుల వాడకంతో వ్యవసాయం సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నది. సేంద్రియ విధానంలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం రైతులు పాలీహౌస్ ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సబ్సిడీని అందజేస్తున్నది. ఇందులో భాగంగా రుద్రూర్లో పలువురు రైతులు పాలీహౌస్ ద్వారా కూరగాయల సాగును చేపట్టారు. ఇందులో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూరగాయలను సాగుచేస్తారు. సాగుచేస్తున్న కూరగాయల పంటకు కేవలం సేంద్రియ ఎరువులనే వాడుతారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. పంటకు డ్రిప్ సిస్టం ద్వారా నీటిని అందిస్తారు. దీని ద్వారా నీటి వృథాను కూడా అరికట్టవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో కూరగాయలను పండించడంతో ప్రజలు కూడా వాటిని కొనేందుకు మక్కువ చూపుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం..
పాలీహౌస్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. పాలీహౌస్ను ఏర్పాటు చేసుకునే రైతులకు సబ్సిడీని సైతం అందజేస్తున్నది. ఒక్కో యూనిట్ ధర రూ.33 లక్షలు కాగా బీసీలకు 75 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీని అందజేస్తున్నది. దీంతో రైతులు ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ పాలీహౌస్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 30 మంది రైతులు పాలీహౌస్ను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 28 ఎకరాల్లో వీటి నిర్మాణం చేపట్టారు. రుద్రూర్లో రమేశ్ అనే రైతు పాలీహౌస్ను ఏర్పాటు చేసి కూరగాయలను పండిస్తున్నాడు. ఇందులో తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ అధిక లాభాలను గడిస్తున్నాడు. కూలీల కొరతను కూడా అధిగమించి తానే స్వయంగా సాగుచేసుకుంటూ ఎకరానికి సంవత్సర కాలంలో లక్షా యాభై వేల రూపాయలను సంపాదిస్తున్నాడు.
తాజా కూరగాయలు లభిస్తున్నాయి..
వారంలో రెండుసార్లు ఇక్కడి పాలీహౌస్ నుంచి కూరగాయలను తీసుకెళ్తా. రసాయన ఎరువులు వాడరు. దీంతో ఆరోగ్యానికి చాలా మంచిది. తా జా కూరగాయాలు తక్కువ ధరకే లభించడం సంతోషంగా ఉంది.
మోత్కూరి శంకర్, రుద్రూర్.
ఐదేండ్లుగా కూరగాయలు పండిస్తున్న..
నేను పాలీహౌస్ను ఏర్పాటు చేసి ఐదేండ్లు అవుతున్నది. అప్పటి నుంచి కూరగాయలను పండిస్తు న్న. ఏదో ఒక ప్రయోగం చేసినట్లు ఉన్నది. సాగులో ఏటేటా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. సేంద్రి య సాగులో కూరగాయలు పండించడంతో డిమాండ్ బాగున్నది.
-రమేశ్, పాలీహౌస్ యజమాని
విషయ అవగాహన పెరిగింది..
నేను ఖమ్మంలోని అగ్రికల్చర్ కళాశాలలో బీఎస్సీ (అగ్రికల్చర్) ఫైనలియర్ చదువుతున్నాను. అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పెరిమెంట్ ప్రోగ్రెస్లో భాగంగా రు ద్రూర్లో శిక్షణకు వచ్చాను. ఆరు నెల ల ట్రైనింగ్లో భాగంగా నాలుగు నెల లు పూర్తయ్యింది. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను.
-సాయి నిఖిల్, విద్యార్థి.
28 ఎకరాల్లో పాలీహౌస్ల ఏర్పాటు
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 28 ఎకరాల్లో 30 మంది రైతులు పాలీహౌస్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా తగిన సబ్సిడీని అందజేస్తున్నది. పాలీహౌస్ను ఏర్పాటు చేసిన రైతులు కేవలం కూలీలపైనే భారం వేయకుండా దగ్గర ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు గడించవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో పాలీహౌస్ల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లేదు.
నర్సింగ్దాస్, డీడీ హార్టికల్చర్, నిజామాబాద్.