Organic fertilizers | సహజ సిద్ధ కర్బనం కలిగిన మొక్కలు, జంతువులు, నీటి వ్యర్ధాలు, ఇతర జీవ పదార్ధాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించి నేలలోని పోషకాలను పంటలకు సమగ్రంగా అందే విధానాన్నే సుస్ధిర వ్యవసాయంగా పిలుస్తాం. ఇలాంటి వ్యవసాయం చేయాలంటే సేంద్రీయ ఎరువుల అవసరం ఉంటుంది. సేంద్రీయ ఎరువులను వాడటం వల్ల దిగుబడులు సాధించడమే కాకుండా నేల, నీరు, వాతావరణం, కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే, నేల సజీవంగా ఉండే విధంగా పంటలను పండించవచ్చు.
పంటల అధిక దిగుబడి కోసం ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడుతుండటం మనం చూస్తున్నాం. ఫలితంగా ఆహారపదార్ధాలు నిస్సారంగా మారడంతోపాటు మనకు ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడుతున్నాయి. వీటితో పాటు భూమిలో సారం తొలిగిపోయి రసాయనాలు ఆక్రమించుకుంటున్నాయి. ఫలితంగా ప్రతీ పంటలో రసాయనాలు కలిసి మనకు తెలియకుండానే అవి మన శరీరంలోకి వెళ్లి వివిధ వ్యాధులకు కారణాలవుతున్నాయి. అయితే, సహజ వనరులైన సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ, నాణ్యమైన, అధిక దిగుబడులను పొందవచ్చు.
సేంద్రీయ ఎరువుల రకాలు
స్థూల సేంద్రీయ ఎరువులు
చిక్కటి సేంద్రీయ ఎరువులు
స్థూల సేంద్రీయ ఎరువులు
ఈ ఎరువులలో పశువుల ఎరువు (0.5 శాతం నత్రజని, 0.4 శాతం భాస్వరం, 0.5 శాతం పొటాఫ్) కంపోస్టు (0.4 శాతం నత్రజని, 0.5 తం భాస్వరం, 1.4 శాతం పొటాష్) ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల సూక్ష్మ మూలకాల సేంద్రీయ ఎరువులతో లభ్యమవుతాయి. ఇవి నేల భౌతిక లక్షణాలను అభివృద్ధి పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
చిక్కటి సేంద్రీయ ఎరువులు
నూనె గింజలు పంటల నుంచి నూనె తీయగా మిగిలిన పదార్థాన్ని ఎరువుగా వాడుకోవచ్చు. వీటినే చిక్కటి సేంద్రీయ ఎరువులుగా పిలుస్తాం. వీటిలో వేరుశనగ పిండి (7.2 శాతం నత్రజని, 1.6 శాతం భాస్వరం, 1.4 శాతం పొటాష్), ఆవచెక్క (5.2 శాతం నత్రజని, 1.8 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్) వేపపిండి (5.2 శాతం నత్రజని, 1 శాతం భాస్వరం, 1.3 శాతం పొటాష్), ఆముదం పిండి (4.3 శాతం నత్రజని, 1.9 శాతం భాస్వరం, 1 శాతం పొటాష్) ఉంటాయి. అయితే వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవపిండి, పశువుల మేతగా, కోళ్ళ మేతగా వాడుతూ.. మిగిలిన వాటిని మాత్రమే ఎరువులుగా ఉపయోగిస్తున్నారు. చిక్కటి సేంద్రీయ ఎరువుల్లో స్థూల సేంద్రీయ ఎరువుల్లో కల్లా అధిక మోతాదులో పోషకాలు లభ్యమవుతాయి.
జీవామృతం ప్రాధాన్యం
సేంద్రీయ ఎరువుల తయారీలో జీవామృతం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే తయారుచేసుకోవచ్చు. ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను కలిపి వారం రోజులపాటు నిల్వ ఉంచడం వల్ల జీవామృతం సిద్ధమవుతుంది. ఈ జీవామృతాన్ని మొక్కల మొదట్లో వేయడం వల్ల చీడపీడల నుంచి నివారణ లభిస్తుంది.
సేంద్రీయ ఎరువులతో ప్రయోజనాలు
నేల భౌతిక స్థితిపరంగా అభివృద్ధి చెందుతుంది.
సూక్ష్మజీవుల ఉత్పత్తి చేసే హార్మోన్ల కారణంగా మొక్కలు పెరుగుతాయి.
పురుగు మందుల అవశేషాలను విచ్ఛన్నం చేస్తాయి.
వాతావరణానికి ఎటువంటి హాని తలపెట్టవు.
పంటలకు అధిక మద్దతు ధర లభిస్తుంది.
పంటలకు అన్ని రకాల మూలకాలు అందుతాయి.
నేలలోని ఆమ్ల, క్షార లక్షణాలను తగ్గించి నేలను సారవంతం చేస్తాయి.
వేళ్ళు చక్కగా అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.