కరీంనగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలువురు రైతులు అరుదైన ఎల్లో వాటర్ మిలన్ పండిస్తున్నారు. కరీంనగర్ మండలం గోపాల్పూర్కు చెందిన మంద రాధ, తిరుపతి రైతు దంపతులు కొన్నేండ్లుగా సాగు చేస్తున్నారు. ఈ సారి కూడా నాలుగు ఎకరాల్లో పంట వేయగా ఎకరాకు సుమారు 15 టన్నుల దిగుబడి వస్తున్నట్టు రైతు మంద రాధ తెలిపారు.
కిలోకు రూ. 20 చొప్పున రిలయన్స్, ఫ్యూర్ నేచర్, మోర్ వంటి కార్పొరేట్ షాపింగ్ మాల్స్ నిర్వాహకులు కొనుగోలు చేసుకుంటున్నారు. పైన పసుపు రంగులో కనిపించే ఈ కాయ లోపల ఎరుపు రంగులో ఉంటుంది. చూడగానే తినాలనిపించేలా, చాలా రుచిగా కూడా ఉంటుంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్ కూడా ఈ రకం వాటర్ మిలన్ పండించారు. కిలో రూ.40 చొప్పున జగిత్యాలలో విక్రయిస్తున్నారు.