చలికాలంలో ఉసిరి కాయలపై తుప్పు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కోతకు ముందే కాయలు రాలిపోయి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లీటర్ నీటిలో 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తుప్పు తెగులును నివారించవచ్చు.
బత్తాయి, నిమ్మ తోటలు జనవరిలో పూతకు వస్తాయి. ఈ సమయంలో లేత ఆకులపై పేను పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని నివారించేందుకు లీటర్ నీటిలో 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి మొగ్గ పగిలే దశలో ఒకసారి, 10 రోజుల తరువాత మరొకసారి పిచికారీ చేయాలి.
100 లీటర్ల నీటిలో కిలో యూరియా, 1.5 గ్రా. ప్లానోఫిక్స్ కలిపి, మొగ్గ, పూత దశలో పిచికారీ చేయడం వల్ల బత్తాయి, నిమ్మలో పిందె బాగా కడుతుంది.
ప్రస్తుతం జీడిమామిడి తోటలకు ఎండు తెగులు సోకుతుంది. దీనివల్ల పుష్ప గుచ్ఛాలు, ఎదుగుతున్న గింజలు మెత్తబడి పోతాయి. పూర్తిగా పెరగకుండానే రాలిపోతాయి. దీనిని నివారించడానికి లీటర్ నీటిలో 1 గ్రా. కార్బెండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.
ద్రాక్ష తోటల్లో జనవరి – ఫిబ్రవరి నెలల్లో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు లీటర్ నీటిలో 0.25 గ్రా. థయామిథాక్సామ్ లేదా 1 మి.లీ. ఫిప్రోనిల్ కలిపి పిచికారీ చేయాలి.
ఒకవేళ పిండినల్లి కనిపిస్తే, కొమ్మలను, ద్రాక్ష గుత్తులను కత్తిరించి నాశనం చేయాలి. లీటర్ నీటిలో 1.25 మి.లీ. బ్యుప్రొఫెజిన్ లేదా 1 గ్రా. మిథోమిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి.