Agriculture | చిలిపిచెడ్, మే 19: అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవుతున్నాయి. రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట కోసే సమయంలో రైతులు, యజమానులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. యంత్రాల ద్వారా పని సులవుగా పూర్తవుతున్నా, పనులు చేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు స్తంభవించే అవకాశాలు ఉన్నాయి. పంట కోసే సమయంలో పొలాల్లో విద్యుత్ లైన్లు ఉంటాయి. హార్వెస్టర్లకు ఆ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకెళ్లే సమయంలో, గడ్డి కట్టలు తరలించేటప్పుడు విద్యుత్ తీగలు తగిలే
అవకాశం ఉంది. అజాగ్రత్తగా ఉంటే వాహనాలతో పాటు ప్రాణాలకు ప్రమాదం తప్పదని అధికారులు సూచిస్తున్నారు.
వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. హార్వెస్టర్ యజమానులు చాలా జాగ్రత్తలు పాటించాలి. పొలంలో కోతల సమయంలో విద్యుత్ వైర్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. హార్వెస్టర్ ఎత్తుగా ఉండడంతో వరికోసే సమయంలో విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది. ట్రాక్టరులో ధాన్యం, వరి మోపులు తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది. పంట పొలల్లో పని చేస్తున్నప్పుడు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం అందిస్తే వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాం. ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలి.
– రాంబాబు, విద్యుత్ శాఖ ఏఈ చిలిపిచెడ్
కూలీల కొరతతో రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. హార్వెస్టర్లతో నూర్పిళ్లు వేగంగా పూర్తవుతున్నాయి. యంత్రాలతో సమయం ఆదా అవుతున్నది. కానీ, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రమాదాలకు చోటు ఇచ్చిన వాళ్లు అవుతారు. కొన్నిచోట్ల భూమి తడిగా ఉండడంతో పొలం కోసే సమయంలో వరి కోత యంత్రాలు దిగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. చేతులతో వరి దుబ్బులు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రైతులు, హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లు ప్రమాదాల బారిన పడకుండా
చూసుకోవాలి.
– బాల్రెడ్డి, మండల వ్యవసాధికారి చిలిపిచెడ్