ఏడాదిలో రెండుసార్లు వరి పండించి, మద్దతు ధర కోసం తండ్లాడటం కంటే.. ఇతర పంటలు వేయడమే మంచిదని అంటున్నారు జగిత్యాల జిల్లా రైతులు. వరితో పోలిస్తే.. రోజువారీగా ఆదాయాన్ని అందించే కూరగాయల సాగే బాగుందని చెబుతున్నారు. రెండు నుంచి నాలుగు నెలల్లోనే దిగుబడి చేతికొస్తుందనీ, ఇతర రైతులు కూడా పంట మార్పిడికి ముందుకు రావాలనీ సూచిస్తున్నారు.
వరి ధాన్యం ఉత్పత్తిలో ఉభయ గోదావరి జిల్లాలను దాటి రికార్డు సృష్టించిన జగిత్యాల జిల్లాలో.. పెద్ద ఎత్తున వరి సాగవుతున్నది. పుష్కలమైన నీటి వసతి, కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాలు పెరగడం, 24 గంటలపాటు కరెంటుతో వరి సేద్యం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల గిట్టుబాటు ధర లభించకపోవడం, దొడ్డు వడ్ల కొనుగోళ్లు ఇబ్బందికరంగా మారడంతో కొందరు రైతులు వరి పంటను వదిలిపెట్టారు. కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
అనుకూల పంటలే!
జగిత్యాల రైతులు బీర, కాకర వంటి తీగజాతికి చెందిన కూరగాయలతో పాటు టమాటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. టమాట పంట కాలం 120 నుంచి 130 రోజులు మాత్రమే. పంట వేసిన 80వ రోజు నుంచి కాత చేతికి వస్తుంది. 120 రోజుల వరకూ నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇక పందిరి జాతికి చెందిన బీర, కాకర, సొరకాయల సాగుకూ సై అంటున్నారు ఇక్కడి రైతులు. ఒక్కసారి పందిరి వేసి, స్ట్రేటింగ్ చేస్తే 40 ఏండ్ల వరకు సాగుకు ఢోకా ఉండదని చెబుతున్నారు.
నిత్యం దిగుబడి..
ఎప్పుడూ డిమాండ్ ఉన్న టమాట, బీరకాయలను భారీగా పండిస్తున్నారు. ఈ పంట కాలం 120 రోజులు. పంట వేసిన 40, 45వ రోజు నుంచి దిగుబడి మొదలవుతుంది. దాదాపు 80 రోజులపాటు బీరకాయ చేతికి వస్తూనే ఉంటుంది. ఈ 80 రోజుల వ్యవధిలో ఎకరం తోటలో గరిష్ఠంగా 20 టన్నుల దిగుబడి ఉంటుందని రైతులు చెబుతున్నారు. రోజుకు సగటున రెండున్నర క్వింటాళ్ల దిగుబడి అవుతుందని చెబుతున్నారు. మార్కెట్ ధర ప్రకారం కనీసం కిలోకు రూ.50 చొప్పున లెక్కవేసినా.. రోజుకు రూ.12,500 చొప్పున 80 రోజుల్లో రూ. పది లక్షల ఆదాయం వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తీరొక్క కూరగాయలు పండిస్తూ, ఎప్పటికప్పుడు ఆదాయం పొందుతున్నామని జగిత్యాల జిల్లా రైతులు చెబుతున్నారు.
రోజుకు రూ.5 వేల దాకా..
ఒకప్పుడు వరి వేసేవాళ్లం. అయితే కష్టం, పెట్టుబడి ఎక్కువ.. లాభాలు తక్కువగా ఉండటంతో కూరగాయల వైపు మళ్లాం. ఇప్పుడు టమాట, బీరకాయలు పండిస్తున్నాం. ప్రతిరోజు కాయగూరలను తెంపి జగిత్యాల రైతుబజార్కు తరలిస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు మంచి ఆదాయం పొందుతున్నాం. ప్రతిరోజూ రూ.మూడు నుంచి రూ.5 వేల దాకా ఆర్జిస్తున్నాం. మొదట్లో అనుమానంతోనే కూరగాయల సాగు ప్రారంభించినా, ఇప్పుడు మంచి ఫలితాలు పొందుతున్నాం. ముందు తాత్కాలిక పద్ధతిలో సాగు చేశాం. శాశ్వత పద్ధతిలో బీర, టమాట సాగు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. సిమెంట్ స్తంభాలు, వైరు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.లక్ష చొప్పున సబ్సిడీ ఇచ్చింది. బీర సాగుకు దాదాపు రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల వరకూ ఖర్చవుతుంది. అయితే మంచి దిగుబడి వస్తే రూ. పది లక్షల ఆదాయం వస్తుంది. వరి వేసి ఇబ్బందిపడే కంటే, కూరగాయల సాగు మంచి ఆదాయాన్ని అందజేస్తుంది.
ముస్కు పావని, మహిళా రైతు, గొల్లపల్లి.
– కొత్తూరి మహేష్ కుమార్