కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను నిండుకుండలా మార్చింది. పడావుబడ్డ భూములను సస్యశ్యామలం చేసింది. ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం, 24 గంటల కరెంటు, సబ్సిడీపై పనిముట్లు అందించింది. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడూ లేనంతగా భారీ స్థాయిలో ‘వరి’ సాగయ్యింది. దిగుబడిలో ఉభయ గోదావరి జిల్లాలను వెనక్కి నెట్టింది. అయితే, ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెట్టింది. మద్దతు ధర ఇవ్వకుండా అన్నదాతను ఆగమాగం చేసింది. కేంద్రం తీరుతో.. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని తెలంగాణ సర్కారు సూచిస్తున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పల్లెపల్లెనా అవగాహన కల్పిస్తున్నది. ఆరుతడి పంటలతో అధిక లాభాలు పొందవచ్చని వివరిస్తున్నది. ఈ క్రమంలో అనేక మంది రైతులు పంట మార్పిడికి ముందుకు రాగా.. ప్రభుత్వం సబ్సిడీతో ప్రోత్సహించి, లాభాలబాటలో నడిపిస్తున్నది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసి, భారీ లాభాలు కండ్ల చూస్తున్న పలువురు రైతులపై ప్రత్యేక కథనం..
జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో శామీర్పేట గ్రామం ఉన్నది. ఎటుచూసినా ఆకుకూరల తోటలతో ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది. సుమారు 80 నుంచి 100 కుటుంబాలకు ఆకుకూరల సాగుతోనే ఆదాయం వస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుండటంతో ఇంటిల్లిపాదికీ ఇదే ఉపాధి వనరుగా మారింది.
ఆకుకూరలు @ శామీర్పేట
ఆకుకూరల సాగులో శామీర్పేట రైతులు దూసుకెళ్తున్నారు. గ్రామంలో ఏ చేను చూసినా, పచ్చని ఆకుకూర పంటలతో కళకళలాడుతూ కనిపిస్తున్నది. ఒకప్పుడు వరి మాత్రమే వేసే ఇక్కడి రైతులు, అధికారుల సూచనతో సంప్రదాయ పంటలకు స్వస్తి పలికారు. కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ వ్యవసాయంలో లాభాలు చూస్తున్నారు. ఎక్కువమంది ఆకుకూరలే పండిస్తుండటంతో శామీర్పేట ఆకుకూరల గ్రామంగా మారిపోయింది. గతంతో పోలిస్తే రైతులు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం వచ్చే పంటలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా తక్కువ విస్తీర్ణంలో నామమాత్రపు పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా వినూత్న సాగును మొదలుపెట్టారు. ఇలా గ్రామానికి చెందిన దాదాపు వంద మంది రైతు కుటుంబాలు ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ వస్తున్నారు. గ్రామం మొత్తం కలిసి 100కు పైగా ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు.
సీజనల్ పంటలతోనే..
శామీర్పేట రైతులు సీజన్కు అనుగుణంగా ఆకుకూరలను సాగుచేస్తూ సిరులు పండిస్తున్నారు. వరి, ఇతర వాణిజ్య పంటలకు నీటి వినియోగం ఎక్కువ. పంట వేసినప్పటినుంచీ చీడపీడల బాధా ఎక్కువే. అయితే తక్కువ నీటితోపాటు పెద్దగా చీడపీడల బాధ లేని ఆకుకూరలు సాగు చేస్తూ, అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. వచ్చిన దిగుబడిని తమ పంట చేల వద్దే విక్రయిస్తున్నారు. మిగిలిన కూరగాయలను జిల్లా కేంద్రంలోని మార్కెట్కు తరలిస్తున్నారు. దళారులకు ఇవ్వకుండా రైతులే స్వయంగా తీసుకొచ్చి అమ్ముకుంటారు.
– గాజుల సిద్ధులు యాదవ్
ఆకుకూరలే ఆదరణ..
నాకు రెండెకరాలకు పైగా పొలం ఉంది. ఎకరం దాకా ఆకుకూరలు వేసినం. గతంలో వరి వేసేది. ఎప్పుడూ ఒకే పంట కాకుండా కొత్తగా వేద్దామని ఆకుకూరలు సాగు చేశాం. వరి కంటే ఎక్కువ లాభాలు వస్తున్నయి. ఏడాదికి లక్షకు పైగా సంపాదించుకున్నం. నాలుగు నెలలకు ఒక పంట మారుస్తూ, తీరొక్క ఆకుకూరలు సాగు చేస్తున్నం. వచ్చిన పంటను జనగామ తీసుకుపోయి, మంచి ధరకు అమ్ముకుంటున్నం.
– ఏదు లక్ష్మి, శామీర్పేట