వ్యవసాయం.. రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు నూతన సాగు విధానాలతో.. అన్నదాత ఇంట సిరులు కురిపిస్తున్నది. ప్రయోగాత్మ కంగా విజయవంతమైన ఎత్తుమడుల పద్ధతి.. అధిక దిగుబడికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. సాగులో ఎదురయ్యే అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నది. ఒకే పొలంలో రెండు, మూడు అంతరపంటలు సాగు చేసే అవకాశం ఇస్తున్నది. ముఖ్యంగా పత్తి, కందిలాంటి వాణిజ్య పంటలకు వరదలు, చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తున్నది.
ఎత్తుమడుల పద్ధతి (బెడ్ పద్ధతి)ని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అధిక, అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలతోపాటు అన్ని రకాల నేలలకూ ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. పత్తి, కంది, పత్తి + కంది (1:1), మిర్చి, పసుపు, వంకాయ తదితర పంటలను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేయవచ్చని అంటున్నారు.
ప్రయోగాత్మకంగా..
కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో ఎత్తుమడుల పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగుచేశారు. నాలుగెకరాల నల్లరేగడి నేలలో పత్తి + కంది (1:1) పంట వేశారు. బెడ్ల మధ్య దూరం 150 సెం.మీ., మొక్కల మధ్య దూరం 35 సెం.మీ. పాటిస్తూ, ఒక వరుస పత్తి, మరో వరుసలో కంది సాగు చేశారు. అధిక వర్షపాతం సమయంలో వర్షపునీరు మడులలో నిల్వ ఉండి ఇంకుతుంది. అంతేకాకుండా చేనులో మురుగు నీరు నిల్వకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో మడులలో నిల్వ ఉన్న నీరు.. మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో పండించిన పంటలో పత్తి 5 క్వింటాళ్లు, కంది 6 క్విటాళ్ల దిగుబడి వచ్చినట్లు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు.
తక్కువ ఖర్చుతోనే..
ఎత్తుమడులు చేసుకోవడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇందుకోసం ట్రాక్టర్తో అనుసంధానం చేసే రిడ్జర్ లేదా బెడ్ మేకర్ను ఉపయోగిస్తారు. ఈ పరికరంతో ఒకేసారి రెండు నుంచి నాలుగు మడులను తయారు చేసుకోవచ్చు. పంటలకు అనుకూలంగా సాళ్ల మధ్యదూరాన్ని మార్చుకోవచ్చు. ఎత్తుమడుల పద్ధతిలో సాళ్ల మధ్య దూరం 120 సెం.మీ., 150 సెం.మీ. లేదా 180 సెం.మీ. ఉంచాలి. మొక్కల మధ్య దూరం 20 సెం.మీ., 30 సెం.మీ. లేదా 45 సెం.మీ. ఉంచాలి. బెడ్ ఎత్తు 30-45 సెం.మీ. పాటిస్తూ, విత్తనాలు వేసుకోవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తుమడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది. రెండు మడులు తయారు చేసుకునే బెడ్ మేకర్ యంత్రం ధర.. రూ.30వేలు ఉంటుంది.
అనేక ప్రయోజనాలు..
ఒక పంట పోయినా..
నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తుమడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. ఇందులో అంతరపంటగా కందిని విత్తుకుంటే.. వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదు. గతేడాది ప్రయోగాత్మకంగా 1:1 నిష్పత్తిలో పత్తి, కంది సాగు చేయించాం. అద్భుతమైన ఫలితాలు సాధించాం. బెడ్ వెడల్పు అడుగు, రెండు బెడ్స్ మధ్య దూరం ఐదు అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరం పాటిస్తూ బెడ్స్ ఏర్పాటుచేయించాం. మనుషులతోనే విత్తనాలు వేయించాం. గతేడాది కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ.. బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలవలేదు. దీంతో పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. ఒక ఎకరంలో రెండు పంటలూ కలిపి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే.. మరో పంట రైతును ఆదుకుంటుంది. అందుకే, పత్తితోపాటు కందిని కూడా వేసుకోవడం మేలు. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో.. రైతులు ఎత్తుమడుల పద్ధతిని అనుసరించడం మంచిది.
– డి.ప్రవీణ్కుమార్,ప్రధాన శాస్త్రవేత్త, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం.
… మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి