ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్లెమొత్తం ఏకమవుతున్నది. ‘ఊరుమ్మడి సాగు’కు శ్రీకారం చుడుతున్నది. ఒకే పంటకు పరిమితం కాకుండా, తీరొక్క పంటలు పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నది.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం.. కూరగాయలకు కేరాఫ్గా మారింది. మండలంలోని ఏ పల్లెకు వెళ్లినా.. టమాట, మిర్చి, వంకాయ, బెండ.. ఇలా తీరొక్క తోటలు దర్శనమిస్తాయి. ఏ తోటలో చూసినా రైతు దంపతులు ఏదో ఒక పనిచేసుకొంటూనే కనిపిస్తారు. ఒకరకం దిగుబడి పూర్తయ్యేసరికి, మరో రకం చేతికి వచ్చేలా ‘పక్కా ప్రణాళిక’తో ముందుకెళ్తున్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయలను సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్, గంగాపూర్, మాచాపూర్, విఠలాపూర్, చిన్నకోడూరు, రామంచ, చౌడారం, అల్లిపూర్, రామన్నపల్లె, సలేంద్రి, మెట్పల్లి గ్రామాల రైతులు ఆరుతడి పంటలతో అధిక లాభాలు పొందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం గత వానకాలంలో 2,500 ఎకరాలు, యాసంగిలో 3,350 ఎకరాల్లో కూరగాయలను సాగు చేశారు. ప్రధానంగా మిర్చి, టమాట, వంకాయ, బీరకాయ, సొరకాయ, చిక్కుడు, బీర్నీస్, కాకర తదితర కూరగాయలను పండిస్తున్నారు. ఇష్టానుసారంగా కాకుండా, రైతులంతా కలిసి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏ కాలంలో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో.. దానినే పండిస్తూ లాభాలు కండ్ల చూస్తున్నారు.
చిన్నకోడూరు రైతులు 20 ఏండ్లుగా డ్రిప్, స్ప్రింక్లర్లతోనే కూరగాయలు పండిస్తున్నారు. నాటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూరగాయలు సాగు చేసే రైతులకు స్ప్రింక్లర్లను ఇప్పించారు. దీంతో తక్కువ నీటిని ఉపయోగించుకొని, ఎక్కువ పంటలను సాగు చేస్తున్నారు. కేసీఆర్ బాటలోనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్రావు కూడా చిన్నకోడూరు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వరి, మక్కజొన్న కాకుండా మార్కెట్కు అనుకూలంగా కూరగాయలు సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నారు.
కూరగాయల సాగులోనూ అధునాతన పద్ధతులను పాటిస్తూ, అధిక దిగుబడులు పొందుతున్నారు. టమాట సాగులో మల్చింగ్ విధానం, తీగజాతి కూరగాయల కోసం పందిరి పద్ధతులను అవలంబిస్తున్నారు. భారీ దిగుబడులు సాధిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు. చుట్టుపక్కల మండలాలవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మండలంలోని గంగాపూర్, మాచాపూర్ గ్రామాలు మిర్చికి ప్రసిద్ధి. ఇక్కడి దిగుబడులు మహారాష్ట్ర, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఎగుమతి అవుతుంటాయి. అందుకోసమే గంగాపూర్, మాచాపూర్లో ప్రత్యేకంగా మిర్చి మార్కెట్ను ఏర్పాటుచేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి మిర్చిని కొనుగోలు చేస్తున్నారు.
మాకు ఆరెకరాల భూమి ఉంది. రెండెకరాల్లో కాకర, ఎకరంలో బీర, ఎకరంలో టమాట సాగు చేస్తున్నాం. 20 ఏండ్లుగా రకరకాల కూరగాయలు పండిస్తున్నాం. ఒక పంట పూర్తయ్యే
సరికి ఇంకోటి చేతికొచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. అధికారుల సలహాలు పాటిస్తూ, అధిక దిగుబడులు సాధిస్తున్నాం. అవసరం ఉన్నప్పుడే కూలీల సాయం తీసుకుంటాం. రోజుకు నాలుగు నుంచి ఐదు వేల దాకా వస్తాయి. ఖర్చులు పోను నెలకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకూ సంపాదిస్తున్నాం.
–బొబ్బల రామచంద్రారెడ్డి, రేణుక
–కత్తుల శ్రీనివాస్ రెడ్డి