రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, శాస్త్రవేత్తలు ఎన్ని అధునాతన పద్ధతులను కనిపెట్టినా.. అవన్నీ క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే రైతన్నలు ప్రయోజనం పొందుతారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖను ప్రక్షాళన చేస్తూ రాష్ట్రంలోని ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. వారంతా రైతన్నలకు మార్గదర్శకులుగా నిలుస్తూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కృషి చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణ అధికారులు సంప్రదాయ వ్యవసాయంలో సమూల మార్పులు తెచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో రైతులకు మెరుగైన విధానాలు వివరిస్తూ.. మార్పు దిశగా మార్గదర్శకత్వం వహిస్తున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదో ఒక పంట కాకుండా, సీజన్కు తగ్గట్టుగా లాభదాయక పంటలను సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. రైతు క్షేత్రాలలో నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ప్రయోగాత్మకంగా
నిరూపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కాంగ్టి మండలం తడ్కల్ క్లస్టర్కు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి గండ్ల సంతోష్.. తన క్లస్టర్ పరిధిలోని రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. సాగులో నూతన మెలకువలు, ఆధునిక సాంకేతిక పద్ధతులను నేర్పడంలో ముందున్నాడు. సాగులో సరికొత్త విధానాల వైపు రైతులను సమాయత్తం చేస్తున్నాడు. ‘రైతుల నుంచి రైతులకే’ అనే నినాదంతో రైతులతో కలిసి క్షేత్ర స్థాయి సందర్శనలు నిర్వహిస్తున్నాడు.