సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిజనం, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా ఐటీడీఏ ద్వారా లెక్కకు మంచి పథకాలు అమలు చేస్తూనే.. పల్లె పల్లెనా మౌలిక వసతులు కల్పిస్తున్నది. పోడు పట్టాల పంపిణీతో దశాబ్దాల తిప్పలను దూరం చేసింది. 500 జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలను సాకారం చేసింది. సర్కారు పాఠశాలలు, కళాశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. మన ఊరు-మనబడిలో భాగంగా ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చింది. సాగు కోసం రైతన్నలకు ప్రోత్సాహమందిస్తూనే.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నది. అడవిబిడ్డల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూనే.. వారి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. భీం పోరుగడ్డ జోడెఘాట్లో రూ. 25 కోట్లతో స్మృతివనం, స్మారక చిహ్నం నిర్మించి.. వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, వారి బతుకుల్లో వచ్చిన మార్పులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ఉట్నూర్, ఆగస్టు 8 : సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన ఆదివాసీ జనం.. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా లెక్కకు మించి పథకాలు అమలు చేస్తుండగా, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నది. పల్లెపల్లెనా విద్య, వైద్యం, రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది. 500 జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలను సాకారం చేసింది. గిరిజన గ్రామాలు స్వావలంభన దిశగా అడుగులు వేసేందుకు మార్గం సుగమం చేసింది. పోడు పట్టాల పంపిణీతో ఆదివాసీల బతుకులకు భద్రత కల్పించింది. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, గిరిజన చట్టాల అమలు పంచాయతీల తీర్మానాలతో మరింత పటిష్టం చేసుకునే అవకాశం కల్పించింది. పంటల సాగుకు రైతన్నలకు ప్రోత్సాహమందిస్తూనే.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నది. అడవిబిడ్డల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ.. వారి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది.
పోడు పట్టాలతో ఆదివాసీలకు భద్రత..
రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీతో దశాబ్దాల కల సాకారం చేసింది. అడవిబిడ్డల బతుకులకు భరోసానిచ్చింది. ఏళ్లకేళ్లుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు సీఎం కేసీఆర్ పట్టాలు అందించగా, వారిలో ఆనందం వెల్లివిరుస్తున్నది. జిల్లాలో 47,130 ఎకరాలకు సంబంధించి 11,753 మంది రైతులకు పోడు పట్టాలు అందించారు. రైతుబంధు ద్వారా రూ. 23 కోట్ల 56 లక్షల 90 వేలను పంపిణీ చేశారు. అటవీ భూములకు పట్టాలు పొందిన రైతులకు రెండు మూడు నెలల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కూడా అందుబాటులోనికి రానుంది. పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయగా, సంబురం అంబరాన్నంటింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో..
ప్రభుత్వం గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ను నాలుగు జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన చేరువ చేసింది. ఇదే తరహాలో కొత్తగా మండలాలు ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
మా ఊళ్లో.. మారాజ్యం కల సాకారం
మావ నాటే.. మావ రాజ్ అనేది కుమ్రం భీం ఉద్యమ కాలం నుంచి ఆదివాసుల నినాదం. జల్.. జంగల్.. జమీన్తో పాటు మా ఊళ్లో మారాజ్యం కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. ఐదేళ్లక్రితం 500 జనాభా కలిగిన ఆదివాసీ గూడేలు, తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. వాటిని పాలించే అధికారం అడవిబిడ్డలకే అప్పగించడంతో ఆదివాసుల స్వయం పాలన కల సాకారమైంది. జిల్లాలోని 173 పంచాయతీలను పునర్విభజన చేసి 335 పంచాయతీలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి ద్వారా మారుమూల గ్రామాలు సైతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఐటీడీఏ ప్రణాళికలతో అభివృద్ధి బాట..
ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించింది. గిరిజన సంక్షేమంలో ముఖ్యమైన వ్యవసాయం, నీటిపారుదల రంగాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గిరిజన తెగల్లో ఆదివాసీలుగా భావించే నిమ్నజాతి గిరిజనులు కొలం, తోటి, మన్నేవార్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం, గిరివికాసం, సీసీడీపీవం టి పథకాలను అమలు చేస్తోంది. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సీసీడీపీ ద్వారా సుమారు రూ. 10 కోట్లు వెచ్చిస్తున్నారు.
ఇందులో ప్రతి ఆదివాసీ గ్రామానికి రూ. 20 నుంచి రూ. 60 లక్షల వరకు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. గ్రామ అవసరాలను బట్టి చేతిపంపులు ఏర్పాటు, తాగునీటి బావు లు, నీటి ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నారు. సాగునీటికోసం చిన్నచిన్న కుంటల నిర్మాణాలు, చెక్డ్యాంల ఏర్పాటు, సీసీరోడ్లు, డీఆర్డిపోల ఏర్పాట్లు, విద్యుత్, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, మహిళా సంఘాలకు ఉపాధికల్పన పనులు అమలు చేస్తున్నారు.
గిరివికాసం పథకం ద్వారా రూ. 6కోట్లతో ఆదివాసీల భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. గిరిజన గ్రా మాలకు రోడ్లు వేయడంతో పాటు, అడవిబిడ్డలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఐటీడీఏ ద్వారా భారీగా నిధులు కేటాయించింది. గిరిజన యువతకు ఆటోలు, సెంట్రింగ్ యూని ట్లు, కాంక్రీట్ మిక్షర్ యూనిట్లు, డీటీపీ జిరాక్స్ స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లు, కిరాణాలు, పిండిగిర్ని యూనిట్లు, పికప్వ్యాన్లు, టైలరింగ్, టెంట్ హౌస్ యూనిట్లు, ట్రాన్స్పోర్టు వాహనాలు, కూరగాయల అమ్మకపువంటి యూనిట్లు అందిస్తున్నది. వీటితో పాటు గేదెలు, గొర్రెలు, మేకలకు సంబంధించిన యూనిట్లనూ సబ్సిడీ ద్వారా అందిస్తున్నది. దవాఖానల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి, అవ్వాల్ అంబులెన్స్లను సమకూర్చింది.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కల్యాణ లక్ష్మి ద్వారా గిరిజన యువతుల పెళ్లిళ్లకు రూ. లక్షా116 ఆర్థిక సాయం అందిస్తున్నది. గ్రామాల్లో అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సీసీడీపీ ద్వారా మన జిల్లాలో సుమారు 10 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నారు. ఇందులో ప్రతి ఆదివాసీ గ్రామంలో 20 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఖర్చ చేసి మౌళిక వసతులు కల్పిస్తున్నారు. అక్కడి ఆదివాసీల అవసరాలను బట్టి ప్రాధాన్యతాక్రమంలో తాగునీరు కల్పించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామ అవసరాలను బట్టి చేతిపంపులు ఏర్పాటు, తాగునీటి బావులు, నీటిట్యాంకుల నిర్మాణాలు చేపడుతారు. సాగునీటికోసం చిన్నచిన్న కుంటల నిర్మాణాలు, చెక్డ్యాంల ఏర్పాటు, సీసీ రోడ్లు, డీఆర్డిపోల ఏర్పాట్లు, విద్యుత్, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, మహిళా సంఘాలకు ఉపాధికల్పన పనులు అమలు చేస్తున్నారు.
మారుమూల పల్లెల్లో ఆంగ్ల విద్య..
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నుంచి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టగా గిరిజన విద్యార్థులకు సైతం ప్రయోజనం చేకూరుతున్నది. ఇన్నాళ్లూ అ.. ఆ…లు కూడా సరిగా పలకని అడవి బిడ్డలు.. ప్రస్తుతం ఏ,బీ,సీ,డీ..లు దిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా బోధనతో గిరిజన విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం మంచి విద్యా వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లిష్ మీడియం కోసం ఇన్నాళ్లూ మండల కేంద్రాలకు పరుగులు తీసిన గిరి పిల్లలు ఇప్పుడు సొంతూళ్లోనే ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నారు.
జోడెఘాట్కు ప్రత్యేక గుర్తింపు
దశాబ్దాలుగా సరైన రహదారికి కూడా నోచుకోని జోడెఘాట్ గ్రామానికి రూ. 15.95 కోట్లతో రెండు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మించింది. కెరమెరి మండలం హట్టి నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని జోడెఘాట్కు 8 గ్రామాలను కలుపుతూ రెండు వరుసల రహదారి నిర్మాణం పూర్తి చేసింది. జోడెఘాట్కు సరైన రోడ్డులేక ఇబ్బందులు పడుతు న్న ఈ ప్రాంత వాసుల సమస్యలను పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. జోడెఘాట్లో రూ. 25 కోట్లతో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియాన్ని నిర్మించి, వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నది. సంస్కృతీ సంప్రదాయలతో పెనవేసుకున్న ఆదివాసుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వారి సంక్షేమానికి బాటలు వేస్తోంది.
ఆదివాసీల ఆరాధ్యదేవతకు గుర్తింపు..
ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే జంగుబాయి పుణ్యక్షేత్రానికి తెలంగాణ సర్కారు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. యేటా పుష్యమాసంలో నెల పాటు జరుపుకునే ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తోంది. ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయలతో అత్యంత ఘనంగా జరుపుకునే అమ్మవారి వేడుకలకు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి రావడం విశేషం.
ఐక్యరాజ్య సమితి అధ్యయనం
ప్రంచంలోని ఆదివాసుల స్థితిగతిలపై ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేసింది. వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది. ప్రపంచ దేశాల్లో ఆదివాసులు.. వారి మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయని గ్రహించిన ఐక్యరాజ్య సమితి 1994 ఆగస్టు 9న జెనివాలో ప్రపంచ ఆదివాసీ సమావేశం నిర్వహించింది. 1994 నుంచి 2014 వరకు రెండు దశాబ్దాల కాలాన్ని ఆదివాసీ దశాబ్దాలుగా ప్రకటించింది. ఈ కాలంలో అన్ని దేశాల పరస్పర సహకారంతో మానవ హక్కులు, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించడానికి కృషిచేయాలని ఆదేశించింది. భారత రాజ్యంగంలోని ఆదివాసీ రక్షణకు 5, 6 షెడ్యూల్ పీసా, అటవీ హక్కు చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీలాంటి చట్టాలతో మేలు చేయాలని సూచించింది.
గిరిజనులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం
ఉట్నూర్, ఆగస్టు 9 : గత ప్రభుత్వాలు ఆదివాసుల గురించి పట్టించుకు న్నది లేదు. ఓట్లప్పుడు.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు, జయంతి లకు వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తామని ఆ తర్వాత పత్తాలేకుండా పోయేటోళ్లు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి కండ్ల ముందే కనబడుతుంది. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలిప్పించారు. ఇటీవల జిల్లాలో 12 వేల మందికి మంత్రి ఐకేరెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ఆ భూములకు సంబంధిం చి రైతుబంధు డబ్బులు కూడా పడుతున్నాయి. స్వరాష్ట్రంలో పల్లెలన్నీ పగతిబాట పట్టాయి. గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తుంది. అలాగే సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలకు పెద్దపీట వేస్తున్నది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది.
-పంద్ర జైవంత్రావ్, ఉట్నూర్ ఎంపీపీ
పోడుపట్టాల కల నెరవేరింది
కెరమెరి, ఆగస్టు 8 : మా ఊరి శివారు లో నాకు ఎకరం భూమి ఉంది. చాలా ఏండ్ల సంది దున్నుకుంటు న్నం. కానీ పట్టాలేక మస్తు ఇబ్బందులు పడ్డం. ఫారెస్ట్ సార్లు వచ్చి మస్తు తిప్పల పెట్టేటోళ్లు. ఇది వరకున్న సర్కారోళ్లు మా గురించి పట్టించుకున్నది లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగినం. ఇగ గింతే అనుకొని ఊరుకున్నం. కానీ సీఎం కేసీఆర్ సార్ మా గోస చూసిండు. గందుకే పట్టాలిచ్చిండు. రైతుబంధు కూడా ఇచ్చిండు. గాయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
– ఆత్రం పోసుబాయి, చిన్న పాట్నాపూర్, జోడెఘాట్
సీఎం కేసీఆర్ను తలుసుకుంటం
కెరమెరి, ఆగస్టు 8 : నాకు మా ఊరిలో నాలుగెక రాల భూమి ఉంది.ఎన్నో ఏండ్ల సంది దున్ను కుంటున్నం. మహారాష్ట్ర, సమైక్యాంధ్ర పాలకు లు మా బాధలను పట్టించుకున్నది లేదు. కనీసం పహానీలు అయినా ఇస్తే బ్యాంకు ద్వా రా పంట రుణాలు తీసుకొని సాగు చేసుకుం టామని అడిగినం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు రైతులందరికీ భూ పట్టాలు అందించారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కూడా అందించి రైతుబాంధవుడిగా నిలిచారు. మా దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్ను బతికున్నంత కాలం తలుసుకుంటం.
– కొడప చిన్ను, ఆదివాసీ రైతు, బోలపటార్(తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామం).