మంచిర్యాల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఓటెత్తారు. వాయిదాలు. కోర్టు తీర్పులు. తర్జన భర్జనల మధ్య ప్రశాంత వాతావరణంలో సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు బుధ వారం నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లలో బ్యాలెట్ బాక్సులను తరలించారు.
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించారు. సింగరేణిలోనే అత్యధిక ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,491 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీరాంపూర్ ఓసీలో అత్యధికంగా 96.4 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎస్సార్పీ 1 క్యాంటీన్లో 95.2 శాతం, ఎస్టీపీపీలో 95.3 శాతం పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లి ఏరియాలో 996 మంది ఓటర్లకుగాను 959 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీపీఏ ఓసీ-2లో, ఖైరిగూడ, సీహెచ్పీల్లో 96 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.
మందమర్రి ఏరియాలో 4,835 ఓటర్లకుగాను 4,515 మంది ఓట్లు పోలయ్యాయి. ఆర్కేపీ ఓసీపీలో 96 శాతం, ఎస్కే మైన్, కేకే 5, కమ్యూనిటీ హాల్ (పాత సీఐఎస్ఎఫ్ క్యాంపు) కేంద్రాల్లో 95 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచే కార్మికులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ఫస్ట్ షిప్టులో వచ్చిన వారు ఉదయం, సెకండ్ షిప్టులో వారు మధ్యాహ్నం, నైట్ షిప్టు డ్యూటీ చేసిన వారు ఉదయమే ఓటింగ్లో పాల్గొన్నారు.
రాత్రి 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. భోజనం చేసిన అనంతరం కౌంటింగ్ మొదలు పెట్టారు. అన్ని గనుల నుంచి వచ్చిన పోలింగ్ డబ్బాలను ఏజెంట్లకు చూపించాక సీల్ ఓపెన్ చేశారు. అనంతరం 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టారు. 13 యూనియన్లకు 13 డ్రమ్ములు పెట్టి వారికి వచ్చిన ఓట్లను అందులో వేశారు. అనంతరం కౌంటింగ్ చేశారు. అంతా ముగిసే సరికి అర్ధరాత్రి అయ్యింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 ఏరియాల్లో ఇల్లందులో తొలి ఫలితం వచ్చింది.. 631 ఓట్లు మాత్రమే ఉన్న ఏరియా ఇది. అనంతరం బెల్లంపల్లి, కొత్తగూడెం, కార్పొరేట్ తరువాత అన్నింటికంటే చివరగా శ్రీరాంపూర్ ఫలితం వచ్చింది.