కాగజ్నగర్, డిసెంబర్ 28 : వేతనాలు చెల్లించాలని కోరుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం వేకువ జామున కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్నా ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాలో పెండింగ్ డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అంజయ్య అక్కడికి చేరుకొని బకాయి ఉన్న వేతనాలు చెల్లిస్తామని, ఫిబ్రవరిలో ఈఎస్ఐ, పీఎఫ్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు శంకర్, సంజీవ్, తదితరులు ఉన్నారు.