నిర్మల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో 735 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా, ఆయా పాఠశాలలకు హైటెక్ సొబగులు అద్దేందుకు చేపట్టిన పనులు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. విడుతల వారీగా ప్రభుత్వ పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేసిన ప్రభుత్వం… పనులను వేగంగా పూర్తి చేసేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. మౌళిక వసతులు, ఇతర సదుపాయాల కోసం రూ.81.86 కోట్లు మంజూరు చేసింది. వారానికోసారి జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ పథకం కింద చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సమీక్ష నిర్వహిస్తున్నారు. పనుల నిర్వహణలో ఎదురవుతున్న లోటుపాట్లు, అలాగే పురోగతిని కలెక్టర్ సమీక్షించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
తొలి విడుతలో 260 పాఠశాలు..
కాగా జిల్లాలో మొదటి విడుతలో 260 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో నుంచి రూ.30 లక్షల విలువకు పైగా చేపట్టాల్సిన పనులు 82 ఉండగా, రూ.30 లక్షల లోపు సంబంధించిన బడుల పనులు 178 ఉన్నా యి. ముందుగా విద్యార్థులకు అత్యవసరమైన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేందు కు ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో రూ.30 లక్షల లోపు పనులను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటి కోసం రూ. 5 కోట్ల ను కేటాయించి, ఆయా స్కూళ్ల ఎస్ఎమ్సీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులతో కొన్ని చోట్ల ఇప్పటికే పనులు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల చివ రి దశలో ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యుద్దీకరణ, తాగునీరు,తరగతి గదుల మరమ్మతు లు, అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్హాల్స్ మొదలగు పనులను చేపట్టారు. డ్యూయల్ డెస్క్, గ్రీన్ చాక్ బోర్డులను నేరుగా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది.