చెన్నూర్, ఆగస్టు 26 : చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం సాగుతున్నదని, అది చూసి మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు కంచుకోటలాంటిదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సుమన్ను ప్రకటించిన సందర్భంగా శనివారం నియోజకవర్గంలో ప్రజా ఆశ్వీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఇందారంలో ప్రారంభమైన ఈ ర్యాలీ జైపూర్, భీమారం, కిష్టంపేట మీదుగా చెన్నూర్ వరకు సాగింది. చెన్నూర్ చేరుకున్న అనంతరం పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ సుమన్ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గంలో 82శాతం మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారని పలు సర్వేలు చెప్పుతున్నాయన్నారు.
రాష్ట్రంలో వందకుపైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమం ఇలానే కొనసాగలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి మహా యజ్ఞం ఆగదన్నారు. గతంలో మారుమూల ప్రాంతంగా ఉండి, అభివృద్ధిలో ఎంతో వెనుకడిన చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే గొప్పగా ఎదుగుతున్నదన్నారు. దొంగ సర్వేలంటూ లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శిం చారు. ప్రజలు దయచేసి ఆగం కావద్దని సూచించారు.
2014కు ముందు పాలించిన ఏ నాయకుడూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఇందారం, రసూల్పల్లి, సుబ్బరాంపల్లి, గంగారం, తుంతుంగా, కిష్టంపేట, సుద్దాల వాగులపై 18 వంతెనలు నిర్మించామని స్పష్టం చేశారు. అలాగే నియోజవర్గంలోని అనేక గ్రా మాలకు రహదారులు నిర్మించామని వెల్లడించారు. చెన్నూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన 50 పడకల దవాఖానను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే వంద పడకల దవాఖాన భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. సుమారు రూ.500 కోట్లతో చెన్నూర్, మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పట్టణంలో నాలుగెకరాల్లో రూ.4 కోట్లతో బస్సు డిపో నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్య కల్పించి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు.
మందమర్రిలో నిర్మించిన 560, క్యాతన్పల్లిలో 286 డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే రూ.80 కోట్లతో మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో నిర్మిస్తున్న రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో రైతులను ప్రోత్సహించడంతో 3 వేల ఎకరాల్లో ఆయిల పామ్ సాగు చేస్తున్నారని, ప్రస్తుతం పంట చేతికి వచ్చిందన్నారు. ఆ రైతులను దృష్టిలో పెట్టుకొని మందమర్రిలో రూ.500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూర్ ఎత్తిపోతల పతకం పనులను రూ1658 కోట్లతో త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ఈ మూడు నెలలు సమన్వయంతో పనిచేస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులను గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చారు : ఎంపీ బోర్లకుంట
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చారని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. ఈ ప్రజా ఆశీర్వాద యాత్రలకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే బాల్క సుమన్ విజయం ఖాయమైందని పేర్కొన్నారు.
సుమన్తోనే అభివృద్ధి : ఎమ్మెల్సీ విఠల్
చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తోనే సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ మరోసారి బాల్క సుమన్ను ఇక్కడికి పంపించారని తెలిపారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన బాల్క సుమన్ను మారోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ప్రభుత్వ మాజీ విప్ నల్లాల ఓదెలు, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్, నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇందారం వద్ద గజమాలతో సన్మానం..
ఇందారం వద్ద కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు విప్ సుమన్కు ఘనస్వాగతం పలికారు. సర్పంచ్ గడ్డం మంజుల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి కిరీటం, కత్తి అందించారు. ఇందారం ఎంపీటీసీ అరికె స్వర్ణ గొర్రెపిల్లను, గొంగలిని అందించారు. సుమన్ను సన్మానించేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సందర్బంగా ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పుస్కూరి రామ్మోహన్రావుతో కలిసి విప్ సుమన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూర్లో అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతున్నదన్నారు. ఇంతటి ఘనంగా స్వా గతం పలికిన కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనను పెద్దపల్లి ఎంపీగా, చెన్నూర్ ఎమ్మెల్యేగా ఆదరించినందుకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ ఐదేండ్లలో చెన్నూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు వివరించారు.
అడుగడుగునా ఘన స్వాగతం..
ప్రజాఆశీర్వాద యాత్రలో విప్ సుమన్కు అడుగడుగున ఘనస్వాగతం లభించింది. ఇందారం వద్ద స్థానిక నాయకులతో పాటు, పలు గ్రామాల ప్రజలు, నాయకులు గజమాలతో సన్మానించారు. ఇందారం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీకి ఇందారం క్రాస్రోడ్డు వద్ద క్యాతనపల్లి, మందమర్రి ప్రాంతాలకు చెందిన నాయకులు స్వాగతం పలికారు. రసూల్పల్లి వద్ద ముదిగుంట, రసూల్పల్లి గ్రామాల ప్రజలు, నాయకులు స్వాగతం పలుకగా, జైపూర్ మండలకేంద్రంలో పార్టీ మండలాధ్యక్షుడు అరవిందరావు, జడ్పీటీసీ మేడి సునిత, ఎంపీపీ రమాదేవి, నాయకులు స్వాగతం పలికారు. ఇందారం వద్ద పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్, ప్రధానకార్యదర్శి సురేందర్రెడ్డి ,రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బేతు తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, గడ్డం ప్రసాద్గౌడ్, అరికె సంతోష్యాదవ్, సుంకరి శ్రీనివాస్ స్వాగతం పలికారు.
దివ్యాంగులకు పింఛన్ ప్రొసీడింగ్ కాపీల అందజేత..
దివ్యాంగులకు పింఛన్ను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్ కాపీలను మంచిర్యాల కలెక్టరేట్లో ఎంపీ వెంకటేశ్ నేతకాని, కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి విప్ సుమన్ లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ పెంపుతో చెన్నూర్ నియోజకవర్గంలో 3,507 మంది దివ్యాంగులకు లబ్ధిచేకూరుతుందని విప్ సుమన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అజ్గర్ మోహియొద్దీన్, కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ తదితరులు పాల్గొన్నారు.
జేపీఎస్లకు క్రమబద్ధీకరణ ఉత్తర్వుల అందజేత..
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ జారీ చేసి క్రమబద్ధీకరణ ఉత్తర్వులను విప్ బాల్క సుమన్ వారికి అందచేశారు. పంచాయతీ కార్యదర్శుల అంకితబావం వల్లే నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో ఫణీందర్ రావ్, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో అక్తర్ మోహియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
విప్ చొరవతో వైద్య కళాశాలలో ప్రవేశం..
విప్ బాల్క సుమన్ చొరవతో రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కొండగొర్ల సడవలక్క-గుడయ్య కొడుకు సుమంత్ టీఆర్ఆర్ మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందాడు. సుమంత్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించాడు. మెడికల్ కళాశాలలో ప్రవేశానికి డబ్బు లేక ఇబ్బందిపడుతున్నాడన్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, తన ఇంటికి పిలిపించాడు. తనవంతుగా రూ.లక్ష సాయం అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా మరో రూ.2 లక్షలు అందించాలని కలెక్టర్కు సూచించారు. వెంట వెంటనే ఈ ప్రక్రియ పూర్తికాగా, విప్ బాల్క సుమన్తో పాటు ప్రభుత్వం నుంచి అందించిన సాయంతో కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సందర్భంగా విప్ బాల్క సుమన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.