కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : వర్షాలు కురుస్తుండడంతో తెల్లబంగారినికి తెగులు సోకుతుంది. పత్తిపంట చేతికొస్తున్న వేళ వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. చెట్టుపైనున్న పత్తితో పాటు కాయలు, ఆకులకు నల్ల మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రైతులు సాగు చేయగా, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 4 లక్షల 50 వేల ఎకరాల సాగుభూమి ఉండగా, ఇందులో దాదాపు 3.60 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా పత్తిలో వచ్చిన దిగుబడులు, గిట్టుబాటు ధర కారణంగా గతేడాది కంటే ఈ యేడాది సుమారు 5 వేల ఎకరాల్లో అదనంగా పత్తి సాగు చేశారు.
ఈ ఏడాది కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండగా, పత్తి పంట బాగా పెరిగింది. గతేడాది కంటే దిగుబడి బాగుంటుందని రైతులు, అధికారులు అంచనాలు వేశారు. పత్తి పంట చేతికి వస్తున్న సమయంలో వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో పత్తి కాయలు నల్లబడి రాలిపోతున్నాయి. దీనికి తోడు ఆకులకు మచ్చలు, ఇతర తెగుళ్లు వస్తుండడంతో పత్తి చెట్లు మాడిపోతున్నాయి. బాగా పెరిగిన పత్తి చెట్లకు సరైన విధంగా గాలి.. వెలుతురు, సూర్యరశ్మి తగులకపోవడం, దీనికి తోడు రోజూ మబ్బులు కమ్ముకొని.. చినుకులు రాలడంతో పత్తికి తెగుళ్లు వస్తున్నాయని అధికారులు అంటున్నారు.
జిల్లాలో ఎక్కువగా ఎత్తుపల్లాల భూములు ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోని చేలల్లో నీరునిలిచి ఉండడం వల్ల భూమి ఆరడం లేదు. దీంతో పత్తి చేలల్లో గడ్డికూడా బాగా పెరుగుతోంది. దీంతో పత్తి చెట్టు నల్లగా మారడం, ఆకులు ఎండిపోతున్నాయి. పత్తికాయలు చె ట్టుపై నిలువకుండా రాలిపోతున్నాయి. దీనికితోడు పొగమంచు కమ్ముకొంటుండడంతో పత్తి పంటకు వివిధ రకా ల తెగుళ్లుసోకే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పత్తి దిగుబడి చాలావరకు తగ్గే ప్రమాదం ఉందంటున్నారు.
వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పత్తి పంట దిగుబడిపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది సుమారు లక్షా 30 వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. ఆ మేరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది అదనంగా 5 వేల ఎకరాల్లో సాగు పెరిగింది. దీంతో లక్షా 50 వేల నుంచి లక్షా 80 వేల క్వింటాళ్ల దాకా పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పంట చేతికొచ్చే సమయంలో వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుత సమయంలో పత్తికి వస్తున్న తెగుళ్లను నివారించేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో తెగుళ్ల బెడద కొంత మేరకు తగ్గడంతోపాటు కాయలు చెట్ల నుంచి రాలిపోయే ప్రమాదం నుంచి నివారించవచ్చని పేర్కొంటున్నారు. మొదటి దశలో రావాల్సిన పత్తి ఇప్పటికే నష్టపోయామని రైతులు బాధపడుతుండగా, తాజాగా మబ్బులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.