నిర్మల్ జిల్లా బీజేపీలో కల్లోలం రేగింది. మొదటి జాబితా విడుదల కాగానే మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల మొదలైంది. మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా వలన నేతలకు టికెట్లు ఇవ్వడం మంట పెట్టింది. ముథోల్ టికెట్ ఆశించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఇప్పటికే రాజీనామా చేయగా, ఖానాపూర్ నుంచి ఆశించిన పెంబి జడ్పీటీసీ భూక్యా జానుబాయి కూడా అదే బాటలో నడవనున్నట్లు తెలుస్తున్నది. పార్టీని నమ్ముకున్నందుకు తమను నట్టేటా ముంచిందని, ఈ అభ్యర్థులను ఓడించేందుకు పని చేస్తామని వారిద్దరూ స్పష్టం చేయడం ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఎవరితో కలిసి నడవాలో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. నిర్మల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి తయారైంది.
– నిర్మల్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ)
నిర్మల్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పెద్దలు వేసుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి, కష్టకాలంలో నమ్ముకున్న నాయకులకు కాకుండా, ప్యారాచూట్ నేతలకు పెద్దపీట వేస్తూ అసెంబ్లీ టికెట్లను కేటాయించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ముథోల్ నియోజకవర్గంలో పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవికి కాకుండా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన రామారావ్ పాటిల్కు పార్టీ టికెట్ కేటాయించింది. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తనను విస్మరించడంపై రమాదేవి తీవ్ర మనస్తాపానికి గురై బీజేపీకి రాజీనామా చేశారు. తన కష్టాన్ని బీజేపీ బూడిదలో పోసిన పన్నీరుగా చేసిందని ఆమె మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన రామారావ్ పాటిల్కు పెద్దపీట వేసి, రెండో స్థానంలో నిలిచిన రమాదేవిని పక్కన పెట్టారని కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అన్యాయం చేసిన బీజేపీకి గుణపాఠం చెబుతానని ఇప్పటికే రమాదేవి ప్రకటించారు. మహిళా ఓట్లే ప్రధాన ఆయుధంగా మలుచుకొని తనకు జరిగిన అన్యాయాన్ని ఇంటింటా తిరుగుతూ వివరించి, బీజేపీ అభ్యర్థి రామారావ్పాటిల్ను ఓడించాలని ఆమె కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు ఆమె తానూర్ మండలంలో పర్యటిస్తూ రామారావ్ పాటిల్ను ఓడించాలని ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఈ సారి బీజేపీకి మహిళా ఓట్లు భారీగా గండిపడే అవకాశం ఉందంటున్నారు. అలాగే నిర్మల్లో సైతం ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన మహేశ్వర్ రెడ్డికే టికెట్ కేటాయించారు.
అయితే మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదన్న అపవాదు ఆయనపై బలంగా ఉంది. అలాగే ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరన్న చర్చ నియోజకవర్గంలో మొదటి నుంచి ఉన్నది. ఇటీవల నిర్మల్లో జరిగిన దసరా ఉత్సవాల్లో వేలాది మంది భక్తుల సమక్షంలో తన అనుచర గణంతో ఉత్సవాల నిర్వాహకులతో గొడవకు దిగడం నిర్మల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిందువుల పార్టీ అని పదే పదే చెప్పుకునే బీజేపీ అభ్యర్థిగా ఉంటూ, హిందువుల ముఖ్య పండుగైన దసరా వేడుకల్లో భయాందోళన వాతావరణానికి కారణమైన మహేశ్వర్రెడ్డి, ఆయన అనుచరుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నుంచి ప్యారాచూట్ నేత రమేశ్ రాథోడ్కు టికెట్ కేటాయించారు.
2018లో ఇండిపెండెంట్గా పోటీచేసి పెంబి జడ్పీటీసీగా గెలుపొందిన భూక్యా జానూబాయి బీజేపీలో చేరి, నాటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం శ్రమించారు. ముందు నుంచి జానూబాయికే బీజేపీ టికెట్ వస్తుందని నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో పార్టీ పెద్దలు ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం పట్ల ఆమె బీజేపీ అగ్ర నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జానూబాయికి టికెట్ రాకపోవడంతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. తనను మోసం చేసిన బీజేపీకి రాజీనామా చేస్తానని, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిస్తానని ఆమె చెబుతున్నారు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అందలం వేయడంతో జిల్లాలో బీజేపీ పరిస్థితి దయనీయంగా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.