ఆసిఫాబాద్,అక్టోబర్22: పుడమి తల్లి పూల జల్లులలో పులకించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా.. పల్లె,పట్నం హరివిల్లులా మారిం ది. ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలు జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగాయి. ఓక్కక్క పువ్వేసి చందమామా …. రెండెసి పులేసి చందమామా రెండు జాములై చందమామా…అంటు ఎంతో ఉత్సాహంగా మహిళలు,యువతులు,చిన్నారులు ఆడి పాడారు. ఉద యం నుంచి రంగు రంగుల పూలతో ఎంతో అందంగా బతుకమ్మను తయారు చేసి సాయంత్రం వేళ అన్ని బతుకమ్మలను ఒక్క చోటుకు తీసుకెళ్లి వేడుకలు జరుపుకున్నారు.
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ ,ఆడ బిడ్డల ఉయ్యాల పాటలతో వాడవాడ హోరెత్తగా, తెలంగాణ సంస్కృతి , సంప్రదయం ప్రతిబింబించింది. దీంతో పాటు డీజే పాటలకు మహిళలు,యువతులు దాండియా ఆడారు. బతుకమ్మకు తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించారు. పసుపుతో చేసిన గౌరమ్మను పూజించి ముత్తైదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని సందీప్నగర్, రాజంపేట్, జన్కాపూర్, శివకేశవమందీర్, బ్రహ్మణ్వాడ, పైకాజీనగర్,పొట్టిశ్రీరాముల చౌక్తో పాటు పలు కాలనీలలో, మండలంలోని గ్రామాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల అనంతరం పెద్దవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
రెబ్బెన, అక్టోబర్ 22: మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోలేటి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఎస్వోటూజీఎం మచ్చగిరి నరేందర్, పీవో ఉమాకాంత్, డీజీఎం(ఐఈడీ) ఉజ్వల్కుమార్ బెహరా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనీయర్ పీవో ప్రశాంత్, సేవా సభ్యులు సోల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ లతో పాటు పలువురు ఉన్నారు.