“సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదు. ఆ అధికారం కేంద్రానికి లేదు. తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉంటే.. కేంద్రం వాటా 49 శాతమే. బొగ్గు గనులను మేం విక్రయిస్తామనే ప్రచారాన్ని నమ్మొద్దు. కొందరు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారు.” ఇవీ.. మొన్న పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన జూమ్లా మాటలు. పద్నాలుగు రోజులు గడవగానే.. కోలిండియాలోని వాటాలు విక్రయానికి బెట్టారు. మొదట వాటాలు విక్రయించడం, ఆ తర్వాత సంస్థను నష్టాల పేరిట ప్రైవేట్కు అమ్మడం మోదీ ైస్టెల్. ఇదే సూత్రాన్ని కోలిండియాలో కూడా అమలు చేస్తుండడంపై సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
-మంచిర్యాల, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “కొన్నేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న, ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయిస్తాం.. లాభాల్లో ఉన్న సంస్థలను అమ్ముతామనేది తప్పుడు ప్రచారం” అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో ఓ ప్రకటన చేశారు. కానీ.. దానికి విరుద్ధంగా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల కంపెనీగా గుర్తింపు పొంది, లాభాల బాటలో నడుస్తున్న కోలిండియా వాటాలు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. బొగ్గు గనులు వేలం వేయబోమని తెలంగాణ గడ్డ మీద మోదీ ప్రకటన చేసి పట్టుమని పదిహేను రోజులు కూడా కాకముందే కోలిండియాను అమ్మేందుకు సిద్ధమవడంపై సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్పుడు ప్రచారమైతే.. కోలిండియా వాటాలు ఎందుకు విక్రయిస్తున్నారో మోదీ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
కొద్దికొద్దిగా ప్రైవేటీకరణ
కోలిండియా కంపెనీకి దేశంలో ఉన్న ఎనిమిది సబ్సిడరీస్లో ఆరు లాభాల్లో ఉండగా, రెండు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కేంద్రానికి అత్యధిక లాభాలు ఇస్తున్న ఏకైక సంస్థ కోలిండియా మాత్రమే. కానీ.. డిజిన్వెస్ట్మెంట్ పేరిట మోదీ ప్రభుత్వం కొద్దికొద్దిగా ఇప్పటికే 24 శాతం కంపెనీ వాటాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. మొత్తంగా కోలిండియాలో 49 శాతం వాటాలను ప్రైవేటు వాళ్లకు ఇస్తామని గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దానికి అనుగుణంగానే పక్కా ప్లాన్ ప్రకారం, డబ్బులు అవసరమైనప్పుడల్లా షేర్ల విక్రయించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కోలిండియాతోపాటు లాభాల్లో ఉన్న హిందుస్థాన్ జింక్(ఆసియాలోనే అతి పెద్ద జింక్ లోహం తయారు చేసే కంపెనీ), దేశంలోనే ప్రధాన ఎరువుల తయారీ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్(ఆర్సీఎఫ్) వాటాలను 5 నుంచి 10 శాతం విక్రయించి రూ.16,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు ఈ కంపెనీలకు స్టార్ మార్కెట్ లిస్ట్ చేసింది.
ఇదే సూత్రం సింగరేణికి?
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా క్రమంగా వాటాలను ప్రైవేటు వాళ్లకు అప్పగించి.. సంస్థను నష్టాల్లోకి నెట్టి.. చివరకు వాటిని అమ్ముకోవడం మోదీ ప్రభుత్వం ైస్టెల్. కోలిండియా విషయంలోనూ ఇదే జరుగుతున్నది. ఇదే సూత్రాన్ని తెలంగాణ సింగరేణికి వర్తింపచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన కేంద్రం.. సింగరేణి సంస్థ పరిధిలోని ఇల్లందు ఏరియాలో ఉన్న కోయగూడెం బొగ్గుబ్లాక్ను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టింది. దీంతోపాటు మరో మూడు బొగ్గు బ్లాక్లను వేలం వేయాలని చూస్తున్నది. ఇలా బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రై వేటుకు కేటాయించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి చివరకు నష్టాల పేరిట సింగరేణిని మొత్తాన్ని ఎక్కడ మింగేస్తారోననే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కోలిండియా అమ్మకానికి సిద్ధమైన మోదీ సింగరేణి ప్రైవేటీకరించబోమని స్పష్టమైన ప్రకటన చేయాలని లేదా కేంద్రం వాటా పూర్త్తిగా రాష్ర్టానికి విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు.