ముథోల్, సెప్టెంబర్ 10 : అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడా గ్రామంలోని రైతువేదికలో శనివారం చించాల, వెంకటాపూర్ గ్రామాల 117 మంది లబ్ధిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అయేషా అప్రోజ్ ఖాన్, సర్పంచ్ శ్వేతారవికిరణ్ గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
తరోడా గ్రామానికి చెందిన జర్నలిస్ట్ మల్లెపూల ఓమేశ్ కూతురు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ. 42 వేలు మంజూరయ్యాయి. తరోడా రైతువేదికలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బాధితురాలు తండ్రికి అందజేశారు. కార్యక్రమంలో ముథోల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు షేపీ ఉల్లాఖాన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మహేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
కుంటాల, సెప్టెంబర్ 10 : నియోజకవర్గంలో అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించేందుకు కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాలలోని రైతు వేదికలో 598 మంది లబ్ధిదారులకు పింఛన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడుతగా మంజూరు చేశామని, మళ్లీ విడుతలో అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పీఎఫ్ కటప్ తేదీతో సంబంధం లేకుండా నిబంధనలు సడలించే విధంగా శాసనసభలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కటప్ తేదీని ఎత్తివేస్తే నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బీడీ కార్మికులకు ఆసరా పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. 27 ప్యాకేజీ ద్వారా కెనాల్ నిర్మాణ పనుల్లో సాంకేతిక లోపం వల్ల రైతుబంధు కోల్పోయిన రైతులకు డిసెంబర్ వరకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాలకు అంబుగాంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న రహదారులకు నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఆత్మచైర్మన్ సవ్వి అశోక్రెడ్డి, సర్పంచ్ సమతావెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముజిగే ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, ఎంపీడీవో మోహన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బొంతల పోశెట్టి, గైని సాయికుమార్, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఐలమ్మ నేటి తరానికి ఆదర్శం
కుంటాల, సెప్టెంబర్, 10 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విరోచిత ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల, పెంచికల్పాడ్, విఠాపూర్, ఓల, అంబకంటి, అందకూర్, కల్లూర్ గ్రామాల్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, సర్పంచ్ సమతావెంకటేశ్, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్ల సంఘం మండ లాధ్యక్షుడు ప్రవీణ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, రజక సంఘం కులస్తులు పాల్గొన్నారు.