మందమర్రి సెప్టెంబర్ 22: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మానవతామూర్తి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో గురువారం రాత్రి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చిరు కానుక ఇవ్వాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఏటా కోటికి పైగా చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మి, ఆసరా, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.330 కోట్లను వెచ్చించి లక్షలాది మందికి బతుకమ్మ చీరెలను అందిస్తున్నట్లు వెల్లడించారు. చెన్నూర్ నియోజక వర్గంలో 55,800 మందికి మహిళలకు చీరెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 24 విభిన్నమైన డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులతో తయారు చేసిన చీరెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీతో ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం, నేతన్నల జీవితాలలో వెలుగులు నిండాయని తెలిపారు.
మహిళలకు సముచిత గౌరవాన్ని కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానికంగా ఉన్న తనకు మహిళలు మద్దతుగా నిలవాలని విప్ బాల్క సుమన్ కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 162.27 కోట్లతో మందమర్రి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, సమ్మక్క-సారక్క మహిళా భవనాలు, బతుకమ్మ మైదానాలు, అర్బన్ మిషన్ భగీరథ పనులు, సమీకృత మార్కెట్, కేసీఆర్ పార్క్ తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. పాతబస్టాండ్ ఏరియాలో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో బాధితులు, వ్యాపారుల కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జిని సాధించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, తనకు మద్దతుగా నిలిచి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.