కుభీర్ : గీత కార్మికుల(Geetha workers) హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని జిల్లా సంఘం అధ్యక్షులు చేపూరి కనుక గౌడ్ (Cheppuri Kanakagoud ) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో సోమవారం మండలంలోని ఆయా గ్రామాల గీత కార్మికులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఎన్నో సమస్యలతో సతమతమవు తున్నారని తెలిపారు. పెన్షన్లు ( Pensions ) రానివారు ఎందరో అల్లాడిపోతున్నారని వెల్లడించారు. చెట్లు గీయనిదే పూట గడవని పరిస్థితిలో ఎందరో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలను సాధించుకునేందుకు గీత కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి జి. మురళి గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముష్కం అశోక్ గౌడ్, జిల్లా అధ్యక్షులు చేపూరి కనకా గౌడ్లను సన్మానించారు. ఆయా గ్రామాల గౌడ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు.