ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మావల వద్ద జరుగుతున్న ప్రవేశ ద్వారం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రధాన కూడళ్లన్నింటిని సుందరంగా తీర్చిదిద్దే పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. పట్టణంలోకి వచ్చే మావల గ్రామం వద్ద, చాంద వద్ద రూ.70లక్షలతో రెండు వెల్కమ్ కమాన్లను నిర్మిస్తున్నామని ఇక్కడ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు.
ఎమ్మెల్యే జోగు రామన్న సహాయంతో పట్టణంలో రోడ్ల వెడల్పు, డివైడర్ల ఏర్పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్ల మధ్యలో అందమైన మొక్కల పెంపకం లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మరో మూడు నాలుగునెలల్లో పనులన్నీ పూర్తి చేసి జిల్లా కేంద్రం రూపురేఖలుమార్చుతామన్నారు. అనంతరం రిమ్స్లో రోగుల సహాయకుల కోసం రూ.60లక్షలతో నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకట శేషయ్య, ఇంజినీర్ తిరుపతి, రాజేశ్వర్, అరుణ్, నాయకులు సాయిని రవి, ఇబ్రహీం, సాయి తదితరులు పాల్గొన్నారు.