ఎదులాపురం : వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఇందులో భాగంగానే వృద్ధులకు న్యాయపరమైన సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధులకు న్యాయ పరమైన సహాయం కోసం ఇంటరాక్షన్ సెషన్ త్వరలో ఏర్పాటు చేయాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు.
కుటుంబాలలోని తగాదాలు, సమస్యలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల అధికారికి పిటిషన్ సమర్పించాలని, వాటిపై విచారణ జరిపి న్యాయపరమైన తీర్పును ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ , ఉట్నూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధిలో ఉన్న కేసులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు కలెక్టర్ సూచించారు. వయో వృద్ధులకు సంబంధించిన చట్టం పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్ట ప్రకారం వృద్ధులకు మేలు చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి ట్రిబ్యునల్లో సీనియర్ సిటిజన్లను సభ్యులుగా చేర్చడంపై పరిశీలిస్తామని తెలిపారు.
జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమం కోసం నిర్ధిష్టమైన చట్టం ఉందని, చట్ట ప్రకారం వారికి దక్కవలసిన అన్ని సదుపాయాలను సమాకూర్చడం వారి కుటుంబ సభ్యులపై ఉంటుందన్నారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వయోవృద్ధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాస్తల సుధాకర్ మాట్లాడారు. అనంతరం ఎనిమిది మంది వృద్ధులకు శాలువా, మెమొంటో అందజేసి పూలమాలలతో కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్, వయోవృద్ధుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.