నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 5 : వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు రైతులకు చేయూత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక సాగు వైపు రైతులను అధికారులు ప్రోత్సహించాలన్నారు.
పంట మార్పిడి విధానం అలవాటు చేయాలన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల డిమాండ్, ప్రాముఖ్యత, లాభాలు, సాగు మెలకువలు వివరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, ఏడీఏలు విద్యాసాగర్, శ్రీనివాసరాజు, సుజాత, వీణ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ మున్సిపాలిటీలోని ఆదర్శనగర్లో ప్రింటింగ్ ప్రెస్లో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణను కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, కమీషనర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొన్నారు.