మంచిర్యాల, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :“అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినా.. కేంద్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా వంట గ్యాస్ ధర పెంచుతోంది. ఫలితంగా కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి దాపురించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన కుటుంబాలకు, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఒక్కో వంటగ్యాస్ సిలిండర్ రూ.400లకే ఇవ్వాలని నిర్ణయించాం.” అని తాజాగా హుస్నాబాద్లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. పదేండ్ల క్రితం రూ.400 ఉన్న సిలిండర్ను కేంద్రం క్రమంగా పెంచుతూ దాదాపు రూ.1100 చేసింది. సామాన్యులు గ్యాస్ కొనుగోలు ఆపేసి, కట్టెల పొయ్యి వాడడం మొదలు పెట్టారు. పేదల బాధలు గుర్తించిన సీఎం కేసీఆర్ భారం తగ్గించడానికి గ్యాస్ ధరను రూ.400 ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో పేదలు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు పేదల పక్షాన నిలుస్తోందని, గులాబీ పార్టీతోనే న్యాయం జరుగుతోందని పేదలు భావిస్తున్నారు.
పదేళ్ల క్రితం రూ.400లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు.. ఫ్రీ కనెన్షన్ అంటే ఆశపడి పేద, మధ్య తరగతి కుటుంబాలు కనెక్షన్ తీసుకున్నయ్. ఎర్రటి సిలిండర్ బుడ్డి ఇంట్లకి రాంగనే ఇగ పొగతోటి బాధ ఉండదనుకున్నరు. కట్టెల తొటి లొల్లి వొద్దునుకున్నరు. కానీ.. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చినంక గ్యాస్ ధర పెంచుడు మొదలుపెట్టింది. గ్యాస్ రేటు డబుల్ చేసి పేదలపై గుదిబండ మోపింది. దీంతో గిరిజనులు, హరిజనులు, దళితులు, పేదలు అధికంగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల పల్లెలు, గ్రామాల్లో గ్యాస్ కొనుడు బందైంది. ఇంట్లో వంట ఆగింది. మళ్లీ కట్టెలపొయ్యే దిక్కైంది. ఇల్లంత పొగవారింది. కానీ.. ఇప్పుడు తెలంగాణ సర్కార్ గ్యాస్ భారం మొత్తం తామే భరించి పేదలకు రూ.400 పాత ధరకు సిలిండర్ ఇస్తామని ఎన్నికల హామీగా ప్రకటించింది. మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో గ్యాస్ గోస తప్పనుందని, సీఎం కేసీఆర్ తీసుకుంది గొప్ప నిర్ణయమని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధర పెరిగిందనే వాడడం మానేసి, కట్టెలపొయ్యి వాడుతున్నమని, తెలంగాణలో మళ్లో సారి కేసీఆర్ సర్కార్ వస్తే పక్కన పెట్టిన సిలిండర్ బుడ్డిని మళ్లీ ఎలిగిస్తామని చెప్తున్నరు. సారు చెప్పిండంటే చేసి చూపుతడని, రూ.400 గ్యాస్ సిలిండర్ ఆయనతోనే సాధ్యమైతదంటున్నరు. పేదల కష్టాలు ఎరిగి అందరి బాధలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ తీసుకొచ్చిందంటున్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, ఇచ్చిన హామీలు అమలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నరు.
సిలిండర్ కొనలేని పరిస్థితి..
ఇచ్చోడ, అక్టోబర్ 17 : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పన్నెండు వందల రూపాయలకు పైగా పెంచింది. ఎన్నికల నేపథ్యంలో గత నెల రెండు వందల రూపాయలు తగ్గించారు. కానీ, ఇప్పుడు సిలిండర్ వెయ్యి రూపాయలకు మా గ్రామానికి తెచ్చి ఇస్తున్నారు. భారీగా ధర పెరగడంతో పేద కుటుంబాలు కొనే పరిస్థితి లేక మళ్లీ కట్టెల పొయ్యినే వాడుతున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేద కుటుంబాలకు 400కే సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. అది అమలు పరిస్తే మహిళలు రుణపడి ఉంటారు.
– జాదవ్ అనిత, సుంకిడి సర్పంచ్, మండలం సిరికొండ
కట్టెల పొయ్యే దిక్కైంది..
తాంసి, అక్టోబర్ 17 : కేంద్రం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలతో కొనలేకపోతున్నాం. ప్రస్తుతం కట్టెల పొయ్యే దిక్కయ్యింది. సీఎం కేసీఆర్ సారు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడంతో ఎంతో మంది నిరుపేదలకు భరోసా కలిగింది. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ ధర తగ్గించడంతోపాటు ఆరోగ్య శ్రీ లిమిట్ పెంచుతామని ప్రకటించడం హర్షణీయం. రూ.15 లక్షలతో ఎంతటి ఆరోగ్య సమస్యలైనా వైద్యం చేయించుకోవచ్చు. ఇప్పుడు పెంచుతామని చెప్పడంతో భరోసా ఉంటది.
– రాజమణి, గృహణి, పొన్నారి
పేద ప్రజలకు ఊరట..
దస్తురాబాద్, అక్టోబర్ 17 : రెక్కాడితే డొక్కడాని పరిస్థితి సామాన్య ప్రజలది. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డీ విరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై ధరలను పెంచుకుంటూ పోతున్నది. దీంతో నిరుపేద కుటుంబాలపై మరింత భారం పడుతున్నది. ప్రస్తుతం సిలిండర్ ధర వెయ్యి దాటింది. కొనే పరిస్థితి లేక కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నం. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది. ఆర్థికంగా భారం పడకుండా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం.
– ఎండపెల్లి సవిత, గృహిణి, దేవునిగూడెం
సారు మాటంటే మాటే..
కుభీర్, అక్టోబర్ 16 : నా భర్త ముత్తన్న కాలం జేసిండు. నాకు ఇద్దరు కొడుకులు, బిడ్డ. నేను చిన్న కొడుకు దగ్గర్నే ఉంటున్న. యోడు నూర్లున్న సిలిండర్ బుడ్డీ పన్నెండు నూర్లకు మోది పెంచిండు. మా అసొంటోళ్లు ఏం గావాలె. నేను కట్టెల పొయ్యి మీద కూడా అండిన దాన్నే. ఈ పెంచిన పైసలతోటి కట్టెల పొయ్యే మంచిగనిపిస్తున్నది. సిలిండర్ అయిపోతదంటేనే భయమనిపిస్తున్నది. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ సారు సిలిండర్ను నాలుగు నూర్లకే ఇస్తానని చెప్పడంతో కాస్త మనసు కుదుటపడ్డది. ఆయన మాటంటే మాటే. ఆయనకే మా ఓటు ఎన్నో పథకాలతోని పేదల అభిమానాన్ని చూరగొన్న అసలు సిసలైన నాయకుడు.
– ఇందూరు శివ్వబాయి, గృహిణి, పార్డి(బీ)
ఇలా ఇస్తారనుకోలే..
భైంసాటౌన్, అక్టోబర్ 17 : గ్యాస్ ధర విపరీతంగా పెరిగి మధ్య తరగతి కుటుంబాలకు పెను భారంగా మారింది. 1200 వరకు పెంచి కంటి తుడుపుగా 200 రూపాయలు తగ్గించినా మా లాంటి కుటుంబాలకు భారంగానే ఉంది. సిలిండర్ కొన్నప్పుడల్లా అంత డబ్బు చెల్లించాలంటే ఇబ్బంది పడుతున్నాం. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో 400లకే గ్యాస్ అందిస్తానని చెప్పడం ఊరట కలిగించింది. ఇలా ఇస్తారని నేను ఊహించలే. సీఎం కేసీఆర్ ఏది చెప్పినా ఖచ్చితంగా చేస్తారు. చేసేదే చెప్తారు. ఆయన మాటకు అంత విలువ ఉంది. ఇచ్చిన హామీ గృహిణులకు ఊరటనిచ్చింది. మళ్లీ కేసీఆర్ సీఎంగా రావాలి.
– కాంతాబాయి, గృహిణి, దేగాం
చాలా భారం తగ్గుతది..
పెంబి, అక్టోబర్ 17 : బీఆర్ఎస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ప్రకటించడంతో చాలా వరకు భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ధరతో అధిక బారమైతున్నది. సిలిండర్ ధర వెయ్యి ఉండడంతో కొన్ని సందర్భాల్లో సిలిండర్లో గ్యాస్ నింపుకోలేని పరిస్థితులున్నాయి. అప్పుడప్పుడూ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి. సీఎం కేసీఆర్ సారు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించినట్లు తెలియడంతో చాలా సంతోషమేసింది. కేసీఆర్ బీమా పథకంతో కూడా మాకు లబ్ధి చేకూరనున్నది. బీఆర్ఎస్ పార్టీకే మేము ఓటు వేస్తాం. – గోదూరి సరోజ, పెంబి
ఆర్థిక భారం తగ్గుతుంది..
బజార్హత్నూర్, అక్టోబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి సిలిండర్ ధర పెంచడంతో సామన్యులపై పెను భారంగా మారుతున్నది. కానీ సీఎం కేసీఆర్ సార్ పేద ప్రజల బాధలను తెలుసుకొని అందరికీ అందుబాటులో ఉండేలా సిలిండర్ ధరను తగ్గించి, అందించాలనుకోవడం గొప్ప విషయం. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టంకట్టి భారీ మోజార్టీతో గెలుపించుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ. ప్రజలంతా అండగా ఉంటారు.
– పరాచ లావణ్య, సర్పంచ్, బజార్హత్నూర్
ఇగ, గ్యాస్ పొయ్యిపై వంట జేస్త..
లక్ష్మణచాంద, అక్టోబర్ 17 : నాపేరు గుర్రం సుశీల. మాది లక్ష్మణచాంద మండలంలోని పీచర. సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు గ్యాస్ పొయ్యిపై వంట చేసిన. కేంద్ర సర్కారోళ్లు వంట గ్యాస్ ధర పెంచుతుండడంతో సిలిండర్ వాడకుండా మూలకేసిన. రూ.1100 అయ్యే సరికి కట్టెల పొయ్యిపైనే వంట జేస్తున్న. పొగ రాంగ, కండ్లు మండంగ, ఇల్లంత పొగచూరంగ వంట జేస్తున్న. ఇగ సుట్టాలొస్తే మా గోస చెప్పరాకుండా ఉంది. సీఎం కేసీఆర్ సారు మా బాధలు చూసి, రూ.400లకే గ్యాస్ మొద్దు ఇస్త అంటున్నడు. మల్ల మూలకేసిన గ్యాస్ పొయ్యిని బయటకు తీసి వంట జేసుకుంటా.