ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, శనగ, గోధుమ పంటలతోపాటు జామ, ఆపిల్బేర్ వంటి విభిన్న పంటలు సాగవుతున్నాయి. ఎండాకాలంలో వాటర్మిలన్(పుచ్చకాయ) అధికంగా పండుతున్నది. లాభాలు బాగా వస్తుండడంతో యేటేటా సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. ఈ యేడాది 130 ఎకరాల్లో సాగవుతున్నది. పంట కాల వ్యవధి 65 రోజులు కాగా.. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తున్నాయి. కిలోకు రూ.8 నుంచి 10 చొప్పున విక్రయిస్తుండగా.. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతున్నది. హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నది.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 13 ( నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఏప్రిల్ 13 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, కంది, సోయాబీన్, యాసంగిలో శనగ, జొన్న, గోధుమ పంటలను సాగు చేస్తారు. ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా మొదలుకొని పంటల కొనుగోళ్ల వరకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. దీంతో జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ పంటలతో పాటు రెండు సీజన్లలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటల సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలను పండిస్తున్నారు.
జిల్లాలో పండిన ఆకుకూరలు, కూరగాయలు స్థానిక మార్కెట్లు, అంగళ్లలో విక్రయించడంతో పాటు నిజామాబాద్, హైదరాబాద్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. జిల్లాలో రైతులు సాగుచేసే టమాట, వంకాయ పంటలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటలను వ్యాపారులు మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. జామ, ఆపిల్బేర్, మామిడి, పుచ్చకాయ, మస్క్మిలన్ లాంటి పండ్ల తోటలను సైతం రైతులు పెంచుతున్నారు. ఎండాకాలంలో ప్రజలు ఎక్కువగా వినియోగించే వాటర్ మిలన్ పంటకు మంచి గిరాకీ ఉండడంతో దీని విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది.
ఎకరాకు లక్షన్నర ఆదాయం..
జిల్లాలో వాటర్మిలన్ సాగు రైతులకు లాభదాయకంగా మారుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతుండగా.. ఈ ఏడాది 130 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పంట కాల వ్యవధి 65 రోజులు ఉంటుందని, సాగులో మెళకువలు పాటించి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం గడించవచ్చని రైతులు అంటున్నారు. ఎకరాకు 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా.. కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు రైతులు విక్రయిస్తున్నారు.
ఎండాకాలంతో పాటు రంజాన్ పండుగ ఉండడంతో వాటర్ మిలన్కు మంచి గిరాకీ ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ పంట విక్రయాలు కొనసాగుతుండగా.. హైదారాబాద్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఆయా రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. వాటర్మిలన్ పంట సాగులో అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి వ్యాపారులు పుచ్చకాయలను కొనుగోలు చేసి జిల్లాలో ఎక్కువ ధరకు విక్రయించేవారు. ప్రజలు అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోయేవారు.