ఖానాపూర్ టౌన్,మే 29 : రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అటవీ విస్తీర్ణం పెంచేందుకు నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వేసవిలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కలిగే నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వర్షాకాలం, చలికాలంలో వన్యప్రాణుల తాగునీటి ఇబ్బందులు ఉండవు. వేసవిలో మాత్రం వాటి దప్పిక తీర్చేందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా సాసర్పిట్లు ఏర్పాటు చేస్తున్నది. సోలార్ బోర్వెల్స్తో నీటిని పెర్కోలేషన్ ట్యాంకుల్లో నింపడంతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నది. వేసవిలో ఏ జంతువులు నీరు తాగేందుకు వస్తున్నాయో గుర్తించేందుకు మండలంలోని అడవిలో పలు చోట్ల ట్రాక్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
పెర్కొలేషన్ ట్యాంకులు, సాసర్పిట్లు
వేపవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకుగాను మండలంలోని అటవీ ప్రాంతాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి సాసర్పిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వీటిలో ప్రతి 10-15 రోజులకోసారి నింపుతారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో నీటి వినియోగం ఆధికంగా ఉండే ప్రాంతాల్లో తరచూ నీటినితో నింపుతారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాసర్ పిట్లలో నీటిని నింపుతారు. కొన్ని సమయాల్లో జనవరి నెల నుంచే చేపడుతారు. ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 8చోట్ల ప్రత్యేకంగా సోలార్ బోరబావులు ఏర్పాటు చేసి వాటితో సాసర్ పిట్లు, పెర్కొలేషన్ ట్యాంక్లలో నీటిని నింపుతున్నారు. దీంతో వన్యప్రాణులు తాగడానికి నీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది. వాటి వద్ద ప్రత్యేకంగా ట్రాక్ కెమెరాలు బిగించారు. నీరు తాగేందుకు వచ్చే వన్యప్రాణుల కదలికలన్నీ ఈ కెమెరాల్లో ఎప్పటికప్పుడు నిక్షిప్తమవుతాయి. అడవిలో జింకలు, కుందేళ్లు,కొండగొర్రెలు, దుప్పులు,తోడేళ్లు, ఇతర వన్యప్రాణులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. వేటగాళ్లు వెళ్లినా ఈ ట్రాక్ కెమెరాల్లో రికార్డు అవుతాయి. వేసవిలో ఎండుటాకులు పడడం వల్ల బాటసారులు,వాహనదారులు కాల్చిన సిగరెట్లు, బీడీలు పడేయడంతో నిప్పంటుకొని అటవీతో వృక్షాలతో పాటు జంతువులకు నష్టం వాటిల్లుతున్నది. దీనిని నివారించేందుకు ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 78కిలో మీటర్ల మేర ఫైర్ కంట్రోల్ లైన్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు
వన్యప్రాణులకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అడవిలో పలు చోట్ల కుంటలు ఏర్పాటు చేశాం. ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో 34 సాసర్పిట్లు ఏర్పాటు చేశాం.అటవీశాఖ విధానాలతో జంతువుల సంఖ్య పెరగడం శుభసూచకం. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా పైర్ కంట్రోల్ లైన్ ఏర్పాటు చేశాం. అగ్ని ప్రమాదాల నుంచి జంతువుల రక్షణకు దోహదం చేస్తుంది.
–గుగ్లోత్ వినాయక్, ఎఫ్ఆర్వో, ఖానాపూర్