ఆదిలాబాద్/నిర్మల్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : రైతన్నలకు గోదాముల గోస తీరింది. రాష్ట్ర సర్కారు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి శాశ్వత పరిష్కారానికి అదనంగా గోదాములను నిర్మించింది. ఆదిలాబాద్ జిల్లాలో 30 గిడ్డంగులు అందుబాటులో ఉండగా.. వాటిలో 24,460 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. ఐదేండ్ల కిత్రం రాష్ట్ర సర్కారు రూ.22.50 కోట్లతో 45 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల తొమ్మిది గిడ్డంగులను నిర్మించింది. నిర్మల్ జిల్లాలో 25,420 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా.. తాజాగా రూ.42 కోట్లతో 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మిస్తు న్నది. కాగా.. ఇంతకుముందు రైతన్నలు పంట ఉత్పత్తులను ఇండ్లు, ఆరుబయట నిల్వ చేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపో యేవారు. ఫంక్షన్, కమ్యూనిటీ హాళ్లు, ప్రైవేట్ గోదాములకు అద్దె చెల్లించి నిల్వ చేసుకునే వారు. గోదాముల నిర్మాణాలతో ఈ బాధలకు చెక్ పడింది. ఇంకా.. పంటలకు మార్కెట్లో ధర లేనప్పుడు రైతుబంధు పథకం కింద అన్నదాతలు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసి 75 శాతం లేదా రూ.2 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశాన్ని కూడా సర్కారు కల్పించింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సీడబ్యూసీ, ఎఫ్సీఐలకు చెందిన 30 గిడ్డంగులు అందుబాటులో ఉండగా.. వాటిలో 24,460 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం ప్రభుత్వం నా బార్డు నిధుల ద్వారా జిల్లావ్యాప్తంగా రూ.22.50 కోట్లతో 45 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో తొమ్మిది గోదాములు నిర్మించింది. ఇచ్చోడ మార్కెట్ యార్డులో రూ.1.50 కోట్లతో 2,500, నార్నూర్లో రూ.3 కోట్లతో 5 వేలు, బేలలో రూ.3 కోట్లతో 5 వేలు.. బోథ్లో రూ.3 కోట్లతో 5 వేలు.. తలమడుగులో రూ.3 కోట్లతో 5 వేలు.. తాంసి మండలంలోని బండల నాగాపూర్లో రూ.3 కోట్లతో 5 వేలు.. ఇంద్రవెల్లి మండలం ధనోరాలో రూ.3 కోట్లతో 5 వేలు, గుడిహత్నూర్ మండలం కొల్హారిలో రూ.3 కోట్లతో 5 వేలు.. ఉట్నూర్లో రూ.3 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలు చేపట్టింది. పూర్తయ్యాయి. కాగా.. రైతుబంధు పథకంలో భాగంగా నిల్వ చేసిన పంట ఉత్పత్తుల ద్వారా 75 శాతం రుణం తీసుకునే అవకాశం ఉందని ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి 25,420 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర అవతరణ అనంతరం దాదాపు రూ.42 కోట్లతో 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మిస్తున్నది. మొట్ట మొదట లక్ష్మణచాంద మండలంలోని బోరిగాం గ్రామ సమీపంలో రూ.30 కోట్ల 20 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములను నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించగా.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీటిని నాలుగు యూనిట్లుగా నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగులశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ గోదాములు అందుబాటులోకి వస్తే శాశ్వత పరిష్కారం లభించనున్నది.
12 చోట్ల నిర్మాణాలు పూర్తి..
నిర్మల్ జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములు పూర్తికాగా.. అందుబాటులోకి వచ్చాయి. 12 చోట్ల గోదాముల నిర్మాణాలు పూర్తి చేశారు. ఒక్కో గోదాం 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. ఒక్కో గోదాం నిర్మాణానికి దాదాపు రూ.3.50 కోట్లను కేటాయించారు. మాటేగాం, చించోలి(బి) గ్రామాల్లో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం.. ముథోల్, తానూర్, దిలావర్పూర్, లోకేశ్వరం, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్, కుంటాల, ఖానాపూర్, కుభీర్ మండలాల్లో మరో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించారు. కాగా.. పంట నిల్వలతోపాటు పీడీఎస్ బియ్యాన్ని కూడా ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వాక్ అహ్మద్ తెలిపారు.