దస్తురాబాద్, ఆగస్టు 2 : పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా అందించాలని వరంగల్ ఐపీసీ డైరెక్టర్ గణపతి సంబంధిత అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహించిన నేఫథ్యంలో మండలంలోని రాంపూర్ గ్రామంలోని గోదావరి తీర ప్రాంతంలో పడిపోయిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను బుధవారం సంబంధిత అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 స్తంభాలు, 20 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అవసరమైన చోట స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు.
వరద ప్రాంతానికి దూరంగా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వేయాలని, సంస్థకు, రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులు మోటర్ల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ మానవ తప్పిదాలతో జరుగుతున్నాయని, ఎల్లప్పుడూ అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. రెవెన్యూ కలెక్షన్లు ప్రతినెలా 100 శాతం వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది అందరూ స్థానికంగా ఉండి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఇటీవల భారీ వర్షాల్లో సైతం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పని చేసినందుకు సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారని సిబ్బందికి తెలిపారు. సేవలను ఇలాగే కొనసాగించాలని సూచించారు. అనంతరం రైతులు డైరెక్టర్ను, డీఈ, ఏడీఏను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగరాజు, ఏడీఏ కేశెట్టి శ్రీనివాస్, సిబ్బంది చరణ్దాస్, సదానందం, ప్రేమ్, రైతులు ప్రభాకర్, పోశన్న, గోపాల్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ను వేగంగా పునరుద్ధరించాలి
పెంబి, ఆగస్టు 2: భారీ వర్షాలకు విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి విద్యుత్ను పునరుద్ధరించాలని ఎన్పీడీసీఎల్ ఐపీసీ డైరెక్టర్ గణపతి అన్నారు. మండలంలోని నాగాపూర్, శెట్పల్లి, పస్పుల గ్రామాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఏడీఏ కేశెట్టి శ్రీనివాస్, ఏఈ జీతి శ్రీనివాస్, లైన్మన్ సత్యం, విద్యుత్శాఖ సిబ్బంది తదితరులున్నారు.