ఆసిఫాబాద్, డిసెంబర్ 20 : నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. బూత్స్థాయి అధికారులకు వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్ దత్ ఎక్కా మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, సంబంధిత ఆధారాలు జతపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతన ఓటు నమో దు కోసం 19 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.
ప్రతి బూత్స్థాయి అధికారి, సూపర్వైజర్లు తమ పరిధిలోని దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి, పూర్తివివరాలు పరిశీలించి, నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చనిపోయిన వారి వివరాలను కుటుంబ సభ్యులను విచారించి, నోటీసులు జారీ చేసి తొలగింపునకు చర్యలు తీసుకుటున్నట్లు చెప్పారు. దివ్యాంగులు, ప్రముఖల ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. ఈఆర్వో లాగిన్లో నమోదు చేసినట్లు, మిగిలిన వాటిని 3 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు వివరించారు.
సినిమా థియేటర్ సందర్శన..
జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక జన్కాపూర్లో ఏర్పాటు చేసి సినిమా థియేటర్ను కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలసి ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క సందర్శించారు. కొంత సేపు సినిమా తిలకించారు. ప్రాంగణంలోని ఫుడ్కోర్టు, దుకాణ సముదాయం, పిల్లల పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, డీఆర్వో రాజేశ్వర్, తహసీల్దార్ రామ్మోహన్రావు, జలీల్, బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమీకృత కలెక్టరేట్ పనుల పరిశీలన..
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ చాహథ్ బాజ్పాయ్తో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వివిధ శాఖలకు కేటాయించిన కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం తుది దశలో ఉన్నదన్నారు. ఆయా శాఖలకు కేటాయించిన కార్యాలయాల్లో మిగిలిన విద్యుత్, పరికరాల ఏర్పాటు, ఇతరత్రా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలతో విధులకు వచ్చే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేసి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల పర్యవేక్షణకు అధికారులను నియమిస్తామని తెలిపా రు. ఖాజానా శాఖ కార్యాలయంలో స్ట్రాంగ్ రూం ఏర్పాటు, సంబంధిత మార్పులపై ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉ ద్యానవనం ఏర్పాటు చేసి, మొక్కలను సంరక్షించాలని ఆ శాఖ అధికారికి సూచించారు. ప్రహరీ, రోడ్డు పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. డీఆర్వో రాజేశ్వర్, డీఎంహెచ్వో ప్రభాకర్రెడ్డి, డీడబ్ల్యూవో సావిత్రి, డీఆర్డీవో సురేందర్, డీడీ మణెమ్మ, డీపీఆర్వో కృష్ణమూర్తి, ఆర్అండ్బీ ఈఈ పెద్దన్న, హర్టికల్చర్ అధికారి నదీం, సీపీవో రవీందర్, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు సత్యనారాయణరెడ్డి, సజీవన్, అధికారులు పాల్గొన్నారు.