లక్షెట్టిపేట, మార్చి 10 : నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు తమ భూమిలిచ్చేది లేదని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు. ఆదివారం భూ సర్వేకు వస్తున్నారని తెలిసి లక్ష్మీపూర్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. గతంలో ఎల్లంపల్లిలో చేపట్టిన శ్రీపాదరావు ప్రాజెక్టు కోసం భూములిచ్చామని, ఇగ ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే.. అవ్వి కూడా లాక్కుంటే ఎలాగని కన్నీటి పర్యంతమయ్యారు.
సాగు భూములను తీసుకునే బదులు ప్రస్తుతం ఉన్న రహదారినే విస్తరించాలని, గ్రీన్ఫీల్డ్ హైవే వద్దే వద్దంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేదాక ఆందోళన కొనసాగిస్తామని మొండికేశారు. లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్ఐ చంద్రకుమార్ బాధితులతో మాట్లాడారు. ఈనెల 12న అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
ఎల్లంపల్లి నిర్మాణంలో 14 ఎకరాల భూమి ఇచ్చినం. ఇప్పడు మళ్లా గ్రీన్ఫీల్డ్ హైవే కోసం సర్వే చేస్తున్నరు. ఉన్న ఏడు ఎకరాల్లో ఐదు ఎకరాల భూమి పోతుంది. ఇంత భూమిని కేంద్రం తీసుకుంటే.. ఇగ మేమెట్లా బతకడం. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిని వెడెల్పు చేస్తే నష్టమేమిటి. అసలు రైతుల భూములు లాక్కుంటే ఎట్లా. ఎట్టి పరిస్థితుల్లో మా భూములివ్వం. – నాగిరెడ్డి రమా, సూరారం
ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సుమా రు16 ఎకరాలపైనే భూమి పోయింది. ఇప్పుడు మరో రెండు ఎకరాలు రోడ్డు కోసం తీసుకో వాలని చూస్తున్నరు. మేమంతా ఎవుసం మీదే ఆధారపడి బతుకు తున్నం. ఉన్న కాస్త భూమి తీసుకుంటే కుటుంబాన్ని పోషించుకునేది ఎలాగో ప్రభుత్వమే చెప్పాలి.
– గోపె అశోక్. లక్షెట్టిపేట
నాకు లక్షెట్టిపేట శివారులో నాలుగెకరాలు ఉంది. అందులో రెండున్నర ఎకరాలు రహదారికి పోతుందంటున్నరు. గీ భూమే మా కుటుంబానికి దిక్కు. ఇది కూడా తీసుకుంటే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఇద్దరు బిడ్డలను ఎట్లా చదివించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– ఎంబడి రాజు. గోదావరి రోడ్డు, లక్షెట్టిపేట