ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ప్రస్తుత బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వ్యాయామం,నడక, ఆటల ద్వారా ఫిట్నెస్పై దృష్టిపెడుతున్నారు. కాగా, ఆదిలాబాద్ పట్టణంలో స్థానికులు, వాకర్లకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో నడక కొనసాగించేలా పంచతత్వ(ఆక్యుప్రెషర్) పార్కును మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రూ. 8. 30 లక్షలతో గాంధీ పార్కులో దీనిని సిద్ధం చేయగా, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న మంగళవారం ప్రారంభించారు. ఇక్కడికి వచ్చేవారికి ఈ పార్కు ఆరోగ్య నేస్తంలా నిలుస్తుందని ఆయన తెలిపారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 21: ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని పంచేందుకు మరో పార్కు ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రోజువారీగా సాగే మార్నింగ్ వాక్కు భిన్నంగా ప్రత్యేక థీమ్తో సరికొత్త వసతులతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఆరోగ్య నేస్తంగా పంచతత్వ ఆక్యుప్రెషర్ పార్కును సిద్ధం చేశారు. పంచభూతాల స్ఫూర్తితో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దీనిని తీర్చిదిద్దారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండోదిగా జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో దీనిని ఏర్పాటు చేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పట్టణంలోని ప్రజలు, వాకర్లకు స్వచ్చమైన గాలినందించి, వారి ఆరోగ్యానికి మేలు చేసేలా ప్రత్యేకంగా పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో ఆర ఎకరం స్థలంలో రూ.8.30 లక్షలతో ఈ పంచతత్వ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో నల్ల రేగడి మట్టి, ఇసుక, 12ఎంఎం, 4ఎంఎం కంకర, చిప్స్, గుళకరాళ్లు, నీటితో కూడిన వాకింగ్ ట్రాక్ను సిద్ధం చేశారు. ఈ ట్రాక్పై చెప్పులు లేకుండా నడవడం ద్వారా అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగి నాడులు ఉత్తేజమవుతాయి. తక్కువ దూరం నడిచినా ఎక్కువ దూరం వెళ్లిన అనుభూతి కలగడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతుంది. వాకింగ్ ట్రాక్లో ఆకట్టుకునే ల్యాన్ను సిద్ధం చేశారు. ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల మొక్కలను నాటారు. పూర్తి ఆహ్లాదపూరిత వాతావరణంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, వ్యాయామం చేసుకునే వీలు కలిగించారు.