జైనూర్ జనవరి 11: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం, ప్రొఫెసర్ హైమన్డార్ఫ్-బెట్టి ఎలిజబెత్ దంపతుల 37వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు పాల్గొని డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వర్ధంతి సభలో వారు మాట్లాడుతూ అడవిబిడ్డల అభ్యున్నతికి హైమన్డార్ఫ్ దంపతులు చేసిన సేవలను కొనియాడారు. మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ కనక ప్రతిభవెంకటేశ్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిషరించుకోవడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారులో మార్లవాయిని ఎంతో అభివృద్ధి చేశామని కొనియడారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కనకరాజు, రాష్ట్ర మహిళా ఉద్యమ నాయకురాలు సుగుణక, ఎంపీపీ తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ చెర్లె లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్లాలా, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్ర భగవంత్రావ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్, ఆదివాసులు పాల్గొన్నారు.