మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 28: ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించకుండా మొండి బకాయిదారులుగా నిలిచిన పలువురు యజమానులకు చెందిన దుకాణాలకు బుధవారం మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్లో ఖమరున్నీసా బేగం పేరుమీద ఏడు దుకాణాలు ఉండగా, వాటికి 2021 నుంచి ఆస్తిపన్ను చెల్లించడం లేదు. మూడేళ్లకు కలిసి రూ. 2.05 లక్షలు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు చెల్లించలేదు.
దీంతో కింద అంతస్తులో ఉన్న మూడు, పైఅంతస్థులో ఉన్న నాలుగు దుకాణాలకు తాళాలు వేశారు. దీంతోపాటే మజీద్ కమిటీకి చెందిన దుకాణాలకు సంబంధించిన ఆస్తిపన్ను రూ. 2.40 లక్షలు ఉండగా, వాటికి కూడా తాళాలు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మజీద్ కమిటీ సభ్యులు మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యను కలిసి తమకు గడువు కావాలని కోరారు. నేరుగా మజీద్ వద్దకు వెళ్లి కమిటీ సభ్యులతో మాట్లాడిన చైర్మన్ మార్చి ఐదో తేదీలోపు పన్ను చెల్లించాలని సూచించారు.