మంచిర్యాల, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్లో భగభగ మండుతున్నాయి. ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండగా.. అదే దారిలో వెజిటేబుల్స్ రేట్స్ కూడా రెట్టింపు(డబుల్) అయ్యాయి. రెండు నెలల క్రితం రూ.200 నుంచి రూ.300లు మార్కెట్కు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వస్తే.. ప్రస్తుతం రూ.600 నుంచి రూ.800 పెట్టినా రావడం లేదు. ధర తక్కువగా ఉన్న టమాట, ఆలు, పప్పులతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నదని జనం పేర్కొంటున్నారు. అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ధరలు కూడా గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యాయని, ఏం కొనాలన్న కిలోకు రూ.100 ఉంటోందని వాపోతున్నారు.
ఎందుకు పెరిగాయి..
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నేలరాలింది. దీనికి తోడు వాతావరణంలో మార్పులు రావడంతో చీడపీడలు పడుతూ.. పూత, కాత రాకుండా పోయింది. సమయానికి వర్షాలు కురియకపోవడం, చలి తీవ్రత అధికంగా ఉండడం వంటి కారణాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. ఇదే సమయంలో అవసరాలకు సరిపడా పంటలు సాగులోకి రాలేదని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. మన వద్ద పంటలు దెబ్బతినడంతో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి మిగిలిన జిల్లాల మార్కెట్లకు కూరగాయలు సరఫరా అవుతున్నాయి. దీంతో ట్రాన్స్పోర్ట్, హమాలీ చార్జీలు పెరగడంతో ధరలు కూడా అమాంతం పెరిగాయి. మొన్నటి వరకు కార్తీకమాసం కావడం, ఇప్పుడు షష్ఠి(మల్లన్న బోనాలు), అయ్యప్ప, సాయిదీక్ష తీసుకున్న భక్తులు అధికంగా ఉండడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది.
ఉత్పత్తి లేకపోవడమూ కారణమే..
అవసరానికి సరిపడా కూరగాయల ఉత్పత్తి లేదు. పంట నష్టంతోపాటు అది కూడా ధరలు పెరిగేందుకు కారణం. మంచిర్యాల మార్కెట్కు అధికంగా బెల్లంపల్లి, మంచిర్యాల రూరల్ ఏరియాల నుంచే కూరగాయలు వస్తాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దిగుమతి పెరిగింది. చలి నుంచి చల్లటి గాలుల నుంచి పంటకు రక్షించుకోవాలంటే విత్తనాలు వేసేప్పుడే కూరగాయల చుట్టూ మక్క లేదా బంతి వేసుకోవాలి. అప్పుడు గాలులతోపాటు చీడపీడల నుంచి రక్షణ ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాలీఫ్లవర్, క్యాబేజీ వేసుకుంటే మంచిది.
– ఉదయ్, హార్టికల్చర్ జిల్లా అధికారి, మంచిర్యాల.
కూరగాయల ధరలు భగ్గు మంటున్నయ్..
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 19 : వామ్మో.. మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నయ్. వంకాయ, చిక్కుడుకాయ, బీరకాయల రేైట్లెతే చెప్పనవసరం లేదు. ఏం కొందామన్నా మార్కెట్ల కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు చెపుతన్నరు. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితేంటి. ఒక్కప్పుడు రూ.300 పట్టుకపోతే వారానికి సరిపడా కూరగాయలచ్చేవి. ఇప్పుడు రెండుమూడ్రోజులకు సరిపడా కూడా రావడం లేదు. ఏదేమైనా కూరగాయల ధరలు తగ్గాలని ప్రతి ఒక్కరూ కోరుకుటున్నరు.
– మాదాసు శ్రుతి, గృహిణి