ఆదిలాబాద్, జూలై 23 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో గ్రామాల్లో అపరిశుభ్రమైన వాతావర ణం నెలకొనేది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడేవారు. పల్లెల్లో కంపుకొట్టే మురుగు కాలువలు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, పెంట కుప్పలు, పిచ్చిమొక్కలు దర్శనమిచ్చేవి. ఈ క్రమంలో ప్రజలు వివిధ వ్యాధులు ప్రబలేవి. కలుషిత జలాల కారణంగా ప్రజలు రోగాలతో బాధపడేవారు. దోమల కారణంగా మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు స్వైర విహారం చేసేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది.
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాల రూపురేఖలను పల్లె ప్రగతి మార్చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడం, చెత్తా చెదారం, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకున్నారు. పిచ్చి మొక్కలు, పెంట కుప్పలను తొలగించారు. వర్షాకాలంలో కలుషిత జలాలు, దోమల కారణంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా రక్షిత నీటిని సరఫరా చేయడంతో పాటు దోమల నివారణకు ఉపక్రమించింది. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో డంప్ యార్డులు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించడం, నర్సరీలను పెంపచం వంటివి చేపట్టారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రతి పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను అందించింది. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఫలితంగా ప్రస్తుతం గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంది.
వానకాలం వ్యాధుల నివారణకు చర్యలు
ఒకప్పుడు వానకాలం ప్రారంభమైందంటే జిల్లాలో సీజనల్ వ్యాధుల బెడద తీవ్రంగా ఉండేది. ప్రజలు పలు రకాల వ్యాధులతో మంచం పట్టేవారు. దవాఖానల్లో బెడ్లన్నీ రోగులతో నిండిపోయేవి. తెలంగాణ ప్రభుత్వం వ్యాధుల నివారణకు కృషి చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో 17 మండలాల్లో 468 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీలో కార్యదర్శులతో పాటు సిబ్బంది పారిశుధ్య నిర్వహణ విధులు నిర్వహిస్తున్నారు. సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ప్రతి రోజూ పరిసరాల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. పారిశుధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా పనులను నిర్వహిస్తున్నారు. తాగునీటి బావుల్లో క్లోరినేషన్ చేయడంతో పాటు దోమలు పెరగకుండా మురుగు కాలువలను ఎప్పటికప్పడు శుభ్రం చేస్తున్నారు. నీటి నిల్వలు లేకుండా చూస్తున్నారు. వీధులు, ఇండ్లలోని చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్ యార్డుకు తరలిస్తున్నారు. డెంగీ దోమలు వృద్ధి చెందకుండా ఇండ్లలోని ఖాళీ డబ్బాలు, డ్రమ్ములు, కొబ్బరి చిప్పలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు వ్యాధులు ప్రబలితే వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో గ్రామాల్లో పారిశుధ్య పనులు కొనసాగుతుండగా ఉన్నతాధికారులు పంచాయతీల వారీగా పర్యవేక్షిస్తున్నారు.
పకడ్బందీగా పారిశుధ్య పనులు
జిల్లాలోని వానకాలం వ్యాధుల నివారణలో భాగంగా పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 468 గ్రామ పంచాయతీల్లో రోజువారీ పనులను పర్యవేక్షిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నిర్వహణ పరిశీలించడమే కాకుండా వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానికులకు తెలియజేస్తున్నాం. దోమలు వృద్ధి చెందకుండా వీధులు, ఇండ్లలో నీటి నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్