మంచిర్యాల, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాగజ్నగర్- సిర్పూర్ ప్రధాన రహదారి మధ్యలో వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం ఎనిమిదేండ్లుగా కొనసాగుతూనే ఉంది. 2016లో కేసీఆర్ సర్కారు ఈ పనులు ప్రారంభించగా, నిమ్మలంగా మేల్కొన్న అటవీశాఖ అనుమతులు లేవంటూ కొన్నేండ్లు పాటు పనులకు అడ్డుతగిలింది. అటవీశాఖ కొర్రీలు.. క్లియరెన్సులు.. కోర్టు కేసులు… నిధుల కొరత.. ఇలా అన్నింటిని దాటుకుంటూ గత ప్రభుత్వం పనులను పూర్తి చేసింది. సుమారు రూ.30 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పూర్తయి ఏడాది కావస్తున్నా రైల్వే శాఖ నిర్లక్ష్యం ఇప్పుడు ఆర్వోబీకి శాపంగా మారింది. ట్రాక్ మీదుగా బ్రిడ్జి వేయాల్సిన బాధత్య రైల్వే శాఖపై ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. రైల్వేలో నిత్యం అధికారులు మారుతుండడం, ఫోన్ నంబర్లు ఛేంజ్ అవుతుండడంతో.. పనులు ముందుకు సాగడం లేదని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్వోబీ పూర్తయితే కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాలకు రవాణా సౌకర్యం మొరుగుపడుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి మార్గం సుగమం అవుతుంది. కానీ రైల్వే అధికారుల పట్టింపులేని తనంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది.
ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, చెన్నై, కేరళ వెళ్లాల్సిన రైళ్లన్నీ సిర్పూర్ కాగజ్నగర్ మీదుగానే వెళ్తుంటాయి. ప్రతి రోజూ దాదాపు 20కిపైగా ప్యాసింజర్, సూపర్ఫాస్ట్, ఎక్సెప్రెస్ ట్రైన్లతో పాటు గూడ్స్ రైళ్లు ఈ మార్గం మీదుగానే పోతుంటాయి. ఉదయం వేళ సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్, భాగ్యనగర్, ఇంటర్సిటీ, తెలంగాణ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లు సింకిద్రాబాద్కు వెళ్లడంతో పాటు అటు నుంచి కాగజ్నగర్కు వచ్చే రైళ్లలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. దీంతో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఎప్పుడు చూసినా బ్రిడ్జి కిందున్న రైల్వే గేట్ మూసే కనిపిస్తుంటుంది. ఈ సమయంలో అత్యవసర పనులపై వెళ్లే వారు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకేసారి నాలుగైదు రైళ్లు క్రాసింగ్ ఉంటే రెండు నుంచి మూడు గంటలు వెయిట్ చేయాల్సిన దుస్థితి. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలోనూ రైళ్ల తాకిడి ఎక్కువగా ఉండడతో ఎదురుచూపులు తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ మార్గంలో రావాలంటేనే భయమేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ సీరియస్గా తీసుకొని ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రైల్వే ట్రాక్పై నుంచి 40 మీటర్ల స్లాబ్ వేస్తే దాదాపు కిలోమీటర్ కొద్ది ఉన్న ఆర్వోబీ మొత్తం అయిపోయినట్లే. కానీ రైల్వే అధికారుల నుంచి స్పందన రావడం లేదు. తరచూ అధికారులు మారుతుండడంతో ఫాలోఅప్ చేయడం ఇబ్బందిగా ఉంది. మెటలింగ్ చేసి, బీటీ వేస్తే ఆర్ అండ్ బీ పనులు అయిపోతాయి. కానీ రైల్వే వాళ్లు స్లాబ్ వేస్తేనే ఈ పనులు చేయగలం. ఇప్పటికైనా రైల్వే శాఖ స్పందించి ఆర్వోబీ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది.
సిర్పూర్(టీ), మార్చి 14 : వేంపల్లి గ్రామ సమీపంలోని రైల్వే గేటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి రోజూ ఈ రూట్లో మస్తు రైళ్లు వెళ్తుంటాయి. ఈ మార్గం మీదుగా సిర్పూర్(టీ), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జుర్ మండలాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే గేటు మూసినప్పుడల్లా దాదాపు కిలో మీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అరగంట దాకా అక్కడే వేచి చుడాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి.