ఉగాది పర్వదినాన్ని ప్రజలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నూతన తెలుగు సంవత్సరం క్రోధికి స్వాగతం పలుకుతూ ఇండ్లలో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే మామిడి తోరణాలతో అలంకరించారు. పిండి వంటలు, షడ్రుచుల పచ్చడితో పండుగను జరుపుకున్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా.. పండితులు పంచాంగ శ్రవణం చేశారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో పచ్చడి పంపిణీ చేశారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఎడ్లను అందంగా అలంకరించారు. వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు. అరక దున్ని, చేలలోనే కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ సంవత్సరం గొడ్డు గోదా, పాడి పంటలు మంచిగా ఉండాలని వేడుకున్నారు. కాగా.. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. దేశ, రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం ఉండాలని వేడుకున్నట్లు వైదిక బృందం తెలిపింది. నేరడిగొండ మండలంలో బోథ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి అరక పట్టి దున్నారు. అలాగే ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న పూజలు చేశారు. ఉగాది పంచాంగ శ్రవణ పూజను ప్రారంభించి కార్యకర్తలకు ఉగాది పచ్చడి అందజేశారు.