సీసీఐ యంత్రాల తుక్కు వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వ, ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మలు దహనం
కదంతొక్కిన గులాబీ శ్రేణులు, సాధన కమిటీ సభ్యులు
కమలనాథులది నమ్మక ద్రోహం : ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తుక్కును కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, సాధన కమిటీ సభ్యులు కదంతొక్కారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహిం చారు. అక్కడే రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వ, ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ సర్కారు నమ్మక ద్రోహం చేసిందని, తుక్కు వేలం ఆపాలని, ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ టౌన్, మే 17 : ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన చేపట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం అమ్మకానికి పెట్ట డం దారుణమని మండిపడ్డారు. పరిశ్రమను పునరుద్ధరిస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చినా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరి వీడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐని కాపాడుకోవడానికి ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ, సభ్యులు బండి దత్తాత్రి, లోకారి పోశెట్టి, బొర్రన్న, శివ, సచిన్, కపిల్, రాహుల్, ఈశ్వర్, జగన్, అశోక్, రాజు పాల్గొన్నారు.
బీజేపీ అసమర్థ పాలనకు నిదర్శనం
ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాల్సిన కేంద్రం అమ్మకానికి టెండర్లు జారీ చేయడం బీజేపీ అసమర్థ పాలనకు నిదర్శనమని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీసీఐ పునరుద్ధరణకు గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న,మాజీ ఎంపీ నగేశ్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలన్నారు.
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ రూరల్, మే 17: సీసీఐ ఆధీనంలో ఉన్న యంత్రాలను కేంద్ర ప్రభుత్వం తుక్కు కింద వేలం వేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని కలెక్టర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్ మాట్లాడారు. సీసీఐని పునరుద్ధరిస్తారనుకున్న యువత ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. సీసీఐ పునరుద్ధరణకు తమ పార్టీ తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అశ్రఫ్, కౌన్సిలర్లు జాదవ్ పవన్ నాయక్, అశోక్ స్వామి, సంద నర్సింగ్, నాయకులు సాజిదొద్దీన్, సలీం పాషా, రామ్కుమార్, దమ్మపాల్, రాజు, సాయి పాల్గొన్నారు.