కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కారిడార్గా ఏర్పాటు చేస్తుండడంపై ఆదివాసులు కన్నెర్ర చేశారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుడుం మోగించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. శనివారం జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని భారీ ర్యాలీ తీశారు. తుడుం వాయిద్యాలతో కుమ్రం భీం చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అక్కడి నుంచి వివేకానంద చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి టైగర్ కారిడార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ సోయం బాపూరావ్ మద్దతు ప్రకటించి.. ఆందోళనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఆందోళన సుమారు ఐదుగంటల పాటు కొనసాగింది. సర్కారు వెనక్కి తగ్గకపోతే మరో కుమ్రం భీం పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు.
సంఘటిత పోరాటం చేస్తాం
– కోనేరు కోనప్ప, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే
జీవో 49 రద్దు కోసం ఆదివాసీలతో కలిసి సంఘటితంగా పోరాటం చేస్తాం. ప్రతి గ్రామంలో ఉద్యమాలు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి గ్రామంలో నల్ల జెండాలతో నిరసనలు చేపడుతాం. టైగర్ కారిడార్కు వ్యతిరేకంగా గిరిజనులు చేపట్టే ప్రతి ఉద్యంలో పాల్గొని వారి వెన్నంటే ఉంటాము. టైగర్ కారిడార్తో గిరిజనుల బతుకులు ఆగమవుతాయి. అటవీ ప్రాంతాల్లో వందేళ్లకు ముందే ఏర్పడిన గ్రామాలకు రోడ్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. కనీసం తాగు నీటి కోసం బోర్లు కూడా వేయనీయడం లేదు. ఇది న్యాయం కాదు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
– సోయం బాపూరావ్, మాజీ ఎంపీ
టైగర్ కారిడార్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. జీఓ 49 రద్దుచేసేవరకు పోరాడుతాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కారణంగానే జీవో 49 వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. ఆదివాసీలను అడువుల నుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే టైగర్ కారిడార్ పేరుతో ఈ జీవోను తీసుకువచ్చారు. ఈ జీవో రద్దుకోసం రాష్ట్ర ప తిని కలిసేందుకు ప్రయత్నం చేస్తాం. ఆదివాసీల సం ఘాలను కలుపుకొని పోరాటాలు చేస్తాం. ఇకపై గిరిజనుల మీద అధికారులు వేధింపులకు పాల్పడితే.. అటవీ అధికారులపై కూడా గిరిజనులు కేసులు పెట్టాలి.
కేసీఆర్ పోడు పట్టాలిస్తే.. కాంగ్రెస్ అడ్డుకుంటుంది
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆసిఫాబాద్
గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు కేసీఆర్ పోడు పట్టాలిచ్చి ప్రభుత్వ పథకాలు వర్తింపజేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను సాగు చేసుకోకుండా అడ్డుకుంటోంది. టైగర్ కారిడార్ పేరుతో ఏకంగా గిరిజనుల భూములను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తోంది. టైగర్ కారిడార్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49ను వెంటనే రద్దుచేయకపోతే మరో కుమ్రం భీం పోరాటం మొదలవుతుంది. ఆదివాసీలమంతా ఏకమై ఆందోళనలు చేపడుతాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం.
గిరిజనులపై ఎందుకీ వివక్ష
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
ఇంద్రవెల్లి సభలో ఆదివాసీలపై ప్రేమను ఒలకబోసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆసిఫాబాద్ జిల్లా గిరిజనులపై వివక్ష చూపుతున్నారు. హైదరాబాద్లో అడవులను ఆక్రమించుకునేందుకు జింకలను చంపిన రేవంత్ రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులులను కాపాడేందుకు ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఆదివాసీలు నివసించే ఆసిఫాబాద్ అడవులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్కు రూ.7,700 కోట్ల నిధులు తెస్తున్న అధికారులు ఐటీడీఏను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలి. ఆదివాసీల బతుకులు ఆగం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికారులను గ్రామాల్లోకి రానివ్వం
– కోట్నాక్ విజయ్ కుమార్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
జీవో 49ని రద్దుచేయక పోతే అడవుల్లోకి అటవీ అధికారులను రానివ్వం. టైగర్ కారిడార్ పేరుతో పోడు రైతులను వేధిస్తే అటవీ అధికారులను ప్రతిఘటిస్తాం. ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకుగానే పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప వారి కోసం ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. ఆదివాసీలను అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది. రాంజీగోండ్ కుమ్రం భీం స్ఫూర్తితో ఆదివాసులు మరోపోరాటానికి సిద్ధం కావాలి.