ఇంద్రవెల్లి, జూలై 18 ః ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మర్కాగూడ పంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొలాం ఆదివాసులు కాలినడకన వెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో బండల మధ్య చెలిమెల ద్వారా బిందెడు నీటిని తీసుకురావాల్సిన దుస్థితి నెలకొన్నది.
దీనికితోడు వర్షాకాలం కావడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అప్పుడప్పుడు వస్తే తాగడానికి కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని పేర్కొంటున్నారు. తమ గ్రామానికి బోరు బావి మంజూరు చేయాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఐటీడీఏ అధికారులు కొలాం ఆదివాసులపై దృష్టి సారించి, బోర్బావి మంజూరు చేయాలని కోలాం ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు.


