ఉట్నూర్, డిసెంబర్ 6 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగ యువకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 2015లో యువ శిక్షణ కేంద్రం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 కోట్లతో స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో అత్యాధునిక భవనం నిర్మించారు. ఈ కేంద్రంలో నిరుద్యోగ గిరిజన యువతకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ యువతీయువకులకు ఆసక్తి గల అన్ని ఉపాధి రంగాల్లో శిక్షణతోపాటు, ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ నోటిఫికేషన్లకు కావాల్సిన కోచింగ్ను ఇస్తున్నారు. ఈ కేంద్రంలో యువతకు ఆసక్తి గల అనేక వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తూ భరోసా కల్పిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా వెలువడే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిరంతరం కోచింగ్ ఇస్తున్నారు. నిష్ణాతులైన నిపుణులతో బోధన, అవగాహన తరగతులు చేపడుతున్నారు.
ఉచిత కోచింగ్
ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్, బెల్లంపల్లి పట్టణాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నాలుగు కోచింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో కంప్యూటర్ ట్రైనింగ్, ఆంగ్ల భాషపై పట్టు, పోటీ పరీక్షలకు కోచింగ్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, సీసీటీవీల ఏర్పాటు ప్లంబింగ్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిషన్ తదితర వృత్తి కోర్సులపై వేలాది మందికి కోచింగ్ ఇస్తున్నారు. గిరిజన యువతకు వసతి ఏర్పాటుతో పాటు భోజనం, డ్రెస్, ట్రైనింగ్ మెటీరియల్, బుక్స్ ఉచితంగా అందిస్తున్నారు. మూడు నుంచి ఆరు నెలల తర్వాత రాష్ట్రంలోని మల్టీ నేషనల్ కంపెనీల్లో రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం, పీఎఫ్ సౌకర్యంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే గతంలో పదుల సంఖ్యలో గిరిజనులు పోలీస్ ఉద్యోగాలకు ఈ వైటీసీల్లో శిక్షణ పొంది ఎంపికయ్యారు.
పరిశ్రమల ఏర్పాటు
యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా తేనె కర్మాగారం ఏర్పాటు చేసి అడవుల్లో తేనెను సేకరించి, శుద్ధి చేస్తున్నారు. ఇందులో పూర్తిగా గిరిజన యువతకు ఉపాధి కల్పించారు. ఉట్నూర్ కేంద్రంగా పల్లి పట్టి, షాంపు, సబ్బుల తయారీ పరిశ్రమ, పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి జీసీసీ ద్వారా విక్రయిస్తున్నారు. అలాగే సిమెంట్ ఇటుకల పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్ నెలకొల్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేస్లాగూడలో ఇత్తడి పాత్రల తయారీని ప్రోత్సహిస్తున్నారు.
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం..
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. వైటీసీల్లో ఉచిత శిక్షణ ఇచ్చి దేశంలోని పెద్ద కంపెనీల్లో జాబ్స్ కల్పిస్తున్నాం. గతంలో యువకులకు ఏ ఉపాధి ఎంచుకోవాలో తెలిసేది కాదు. ప్రస్తుతం ట్రైనింగ్ సెంటర్ ద్వారా మార్కెట్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం యువత కోచింగ్కు వస్తుండడం సంతోషాన్నిస్తున్నది. అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏజెన్సీలో వ్యాపార పరిశ్రమలు ప్రారంభించి గిరిజన యువతకు అవకాశాలు కల్పిస్తున్నాం.
రూ. 15 వేల జీతం వస్తున్నది
ఉట్నూర్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో నాకు శిక్షణ ఇచ్చారు. ఉద్యోగ మేళా నిర్వహించారు. నాకు హైదరాబాద్ రెబల్ ఫుడ్స్లో పని కల్పించారు. నెలకు రూ. 15 వేల జీతం వస్తున్నది. పీఎఫ్ సౌకర్యం కల్పించారు. పని చాలా బాగుంది. ఇక్కడి సిటీ అలవాటైంది. ఇది వరకు ఏ పని దొరకక ఖాళీగా ఉండేవాన్ని. ఇప్పుడు ఉపాధి కల్పించినందుకు ఆనందంగా ఉంది.
జీతంతో పాటు పీఎఫ్ కూడా..
మాది ఆదిలాబాద్ జిల్లా. ఉట్నూర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తర్వాత హైదరాబాద్కు పంపించారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్లో పనిచేస్తున్న. రూ. 10 వేల జీతం ఇస్తూ పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించారు. మొదట హైదరా బాద్ అంటేనే భయమేసింది. పని చేస్తున్న కొద్ది ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అదనంగా పనిచేసుకునే అవకాశం కూడా ఉంది.