గర్మిళ్ల, అక్టోబరు 9 : ఎన్నికల నియమావళిపై అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. అదే విధంగా రాబోయే ఎన్నికల సందర్బంగా పోలీసులందరూ ఎన్నికల సంఘం నియంత్రణలో, పర్యవేక్షణలో పని చేయాలని సూచించారు.
పోలీసు అధికారులు సంబంధిత పోలీస్స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్లే రూట్ను చెక్ చేసుకోవాలని సూచించారు. లిక్కర్, గుడుంబా, గంజాయిలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అబ్కారీశాఖ సమన్వయంతో పనిచేసి, సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు.
చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిత్యం తనిఖీలు చేయాలని, సమస్యాత్మక గ్రామాలను నిత్యం పర్యటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఫంక్షనల్ వర్టికల్స్లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 10 మంది ఏఎస్ఐలు, 27 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 76 మంది కానిస్టేబుళ్లకు రివార్డు మేళా నిర్వహించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ మోహన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.